అందోల్/ అల్లాదుర్గం, జూలై 29: మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని రేణుకామాత ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. అల్లాదుర్గం రేణుకామాత ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయాలని కోరుతూ శుక్రవారం అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అల్లాదుర్గం మండల ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావుకు వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సిఫారసు చేశారు. అనంతరం మండల ప్రజాప్రతినిధులు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే దేవాదాయశాఖ కమిషనర్కు ఫోన్ చేసి అల్లాదుర్గం రేణుకామాత ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయాలని ఆదేశించారు. మంత్రులు హామీ ఇవ్వడంతో అల్లాదుర్గంలో జేఏసీ నాయకులు సంబురాలు నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, పటాకులు పేల్చి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వారు మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులకి వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, అల్లాదుర్గం జేఏసీ చైర్మన్ అంజియాదవ్, ఎంపీటీసీ దశరథ్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, చంద్రయ్య, పాండు, అంజి తదితరులున్నారు.