సంగారెడ్డి, జులై 11: వానకాలానికి తోడు రుతు పవనాల రాకతో సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలో చెదురుముదురుగా వానలు కురువడంతో సరాసరి 21.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ శరత్ నాయక్, ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పట్టణంలోని మహబూబ్సాగర్, కందిలోని కిసాన్సాగర్ చెరువులను సోమవారం సందర్శించారు. జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో 40.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. సదాశివపేటలో 30.5 మి.మీ, కొండాపూర్లో 28.2 మి.మీ, న్యాల్కల్లో 25.9 మి.మీ, అత్యల్పంగా మొగుడంపల్లి మండలంలో 10 మి.మీ వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వానలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి పరిసరా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పాటు చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి.
మెదక్ జిల్లాలో నాలుగు రోజులుగా..
మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతువపనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మెదక్ జిల్లాలో నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. చెరువులు, వాగు లు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పోచారం డ్యాం, ఘనపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.
జిల్లాలో వర్షపాతం..
జిల్లాలో 19.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చేగుంట మండలంలో అత్యధికంగా 28.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పెద్దశంకరంపేట మండలంలో 10.8 మిల్లీమీటర్లు కురిసింది. చిలిపిచేడ్లో 10.8మి.మీ, తూప్రాన్లో 26.4 మి.మీ, మాసాయిపేటలో 25.0 మి,మీ, చిన్నశంకరంపేటలో 24.7 మి.మీ, నార్సింగిలో 24.3 మి,మీ, శివ్వంపేటలో 23.5 మి,మీ, నర్సాపూర్లో 22.1 మి,మీ, మనోహరాబాద్లో 23.7 మి,మీ, కొల్చారంలో 22.4 మి,మీ, రేగోడ్లో 21.9 మి,మీ, కౌడిపల్లిలో 19.0 మి,మీ, వెల్దుర్తి మండలంలో 17.8 మి,మీ వర్షపాతం నమోదైంది.
శివ్వంపేట మండలంలో 41 ఇండ్లు ధ్వంసం
నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శివ్వంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో 41 ఇండ్లు దెబ్బతిన్నాయని ఎంపీవో తిరుపతిరెడ్డి తెలిపారు. శిథిలావస్థలో ఇండ్లు ఉంటే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
నర్సాపూర్ మండలంలో 25 ఇండ్లు
నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు 25 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తహశీల్దార్ భాస్కర్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరుఫున సాయం అందేలా కృషి చేస్తామన్నారు. ఏదైనా సమస్య వస్తే తమ సిబ్బందికి తెలియజేయాలన్నారు.
హత్నూరలో నాలుగు ఇండ్లు
హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో నాలుగు ఇండ్లు కూలిపోయినట్లు ఆర్ఐ గంగాధర్ తెలిపారు. మండలంలోని మాధుర, లింగాపూర్, బ్రాహ్మణగూడ, హత్నూర గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇండ్లు కూలిపోయినట్లు తెలిపారు. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నారింజ ప్రాజెక్టుకు భారీ వరద
మూడు, నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురవడంతో చెరువులు, చెక్డ్యామ్ నిండి నారింజ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో అధికారులు చెరువులు, నారింజ ప్రాజెక్టును పరిశీలించి, గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. సోమవారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) నారింజ ప్రాజెక్టు, శేకాపూర్, మల్చల్మా గ్రామంలో ఉన్న చెరువులను తహసీల్దార్ నాగేశ్వర్రావు, పట్టణ సీఐ తోట భూపతి, జహీరాబాద్ రూరల్ ఎస్సై పరమేశ్, నీటిపారుదల శాఖ ఏఇ జానకిరాంలు పరిశీలించారు. కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ మండలంలో వర్షలు కురవడంతో అధికారులు అప్రమత్తమైన్నారు. ప్రజలు ఎవరు చెరువులు, నారింజ ప్రాజెక్టుల వద్దకు వెళ్లవద్దని తెలిపారు.
నీట మునిగిన పంటలు
చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన రైతు మాణిక్రెడ్డి ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట మొత్తం నీట మునిగింది.
కోహీర్లో..
కవేలి- కోహీర్ గ్రామాల మధ్య ఉన్న నారింజ వాగులోకి సోమవారం భారీగా నీరు చేరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాగుకు ఇరువైపులా ఉన్న పొలాలను సందర్శించి, నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. భారీ వర్షానికి సోయా, పత్తి, కంది తదితర పంటల్లో నీరు చేరింది. దీంతో తమ పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.