సంగారెడ్డి, జూలై 01(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో సైయంట్ ఫౌండేషన్, శిభో ధి ఫౌండేషన్ సంయుక్తంగా ఐఐటీ హైదరాబాద్తో కలిసి బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకోసం సైయంట్ ఫౌండేషన్, శిబోధి ఫౌండేషన్ సంయుక్తంగా రూ.20 కోట్ల నిధులు సమకూర్చనున్నాయి. ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నాయి. స్కూల్ను ఐదేండ్ల పాటు నిర్వహించేందుకు మరో రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నారు. బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ భవన నిర్మాణ పనులకు శనివారం(జూలై 2) కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శంకుస్థాపన చేయనున్నారు. బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇ న్నోవేషన్ ఆండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ భవనంలో ఫ్యా కల్టీ ఆఫీసులు, ఇన్నోవేటర్స్ స్పేస్, కాన్ఫరెన్స్, సెమినార్ రూమ్లు, కంప్యూటేషనల్ ల్యాబ్లు, పీహెచ్డీ పని స్థలం ఉంటాయి.
ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ మేనేజ్మెంట్, స్టార్టప్ కోర్సు లు అందజేస్తారు. సైయంట్ కంపెనీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్తో కలిసి ఏర్పాటు చేస్తున్న బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్ సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు, ఉద్యోగాల కల్పనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనికోసం ఐఐటీ హైదరాబాద్తో మార్చిలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అత్యుత్తమ విద్యా శిక్షణను అందించేందుకు, ఆర్థిక, సామాజిక పరమైన సవాళ్లకు పరిష్కారాలను అందించేందుకు బీవీఆర్ స్కూల్అఫ్ ఇన్నోవేషన్ వేదికగా మారుతుందన్నారు. ఐఐటీ డైరక్టర్ బీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీలో బీవీఆర్ స్కూల్అఫ్ ఇన్నోవేషన్ ఆండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏర్పాటు కానుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభ వెలికి రావటంతోపాటు వారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందన్నారు.