ఝరాసంగం,మే గ్రామాల్లో ప్రజల సమస్యలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పరి ష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఎం పీపీ అధ్యక్షుడు కటికె దేవదాసు అధికారులకు సూచించారు. మంగళవారం ఝరాసంగం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎం పీపీ కటికె దేవదాసు అధక్ష్యతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులతోపాటు అన్ని శాఖల అధికారులు, భాగస్వాములు కావాలని సూచించారు. మండలంలోని పల్లెలు పరిసరాల పరిశుభ్రతతో, హరిత వనాలు కనిపించే విధంగా సమష్టి కృషిచేద్దామన్నారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపించాలన్నారు. సభ్యులు తెలియజేసిన సమస్యలను అధికారులు తమ రిజిస్టర్లో రాసుకుని వచ్చే మండల సభ సమావేశంకల్లా తీర్చాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రీడా మైదానం కోసం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి 1.20 ఎకరాల భూమిని గుర్తిస్తామన్నారు. అందుకు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సహకారం అందించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదుల నిర్మాణం కోసం ఎల్ఎన్టీ సంస్థ అధికారులు 4 లక్షలు మంజూరు చేశారన్నారు.
గదల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని డాక్టర్ మాజిద్ తెలియజేశారు.. మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం మాట్లాడుతూ వానకాలం పంటల సాగుకోసం జూన్ మొదటి వారంకల్లా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ అవుతాయన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. జనుము విత్తనాలకు మాత్రమే సబ్సిడీ వస్తుందన్నారు. మిగతా విత్తనాలు సోయాబీన్, పెసరి, మినుము, కంది విత్తనాలకు రాయితీలు ఉండవన్నారు. గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, మొక్కలకు నీరు సరఫరా చేసి బిల్లులు, రెవెన్యూ ప్లాటేషన్, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు,మరుగుదొడ్లు, పారిశుధ్యం, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని మండల సర్పంచులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎంపీడీవో సుజాత,ఎంపీపీ అధ్యక్షుడు దేవదాసుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, ఎంపీటీసీ లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.