జాతీయ రహదారులు మృత్యు‘మార్గం’గా మారుతున్నాయి.. 65వ జాతీయ రహదారి లోపభూయిష్టంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో నిత్యం రక్తమోడుతున్నది. నాలుగు లేన్లుగా రోడ్డుగా విస్తరించినా ప్రమాదాలు తగ్గడం లేదు. ఈ రోడ్డుపై ఫ్లైఓవర్లు లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా చెరాగ్పల్లి శివారులో 70 కిలోమీటర్లు మేర జాతీయ రహదారిని రూ.1,266.60 కోట్లు ఖర్చుచేసి విస్తరించారు. కంకోల్, మంగళగిరిల వద్ద టోల్గేట్ల ఏర్పాటు చేసి టోల్ వసూలు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం ఎల్అండ్టీ కంపెనీకి అప్పగించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించారు. అధికారుల పర్యవేక్షణ సరిగాలేక పోవడంతో లోపాలే శాపాలుగా మారాయి. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఇంజినీరింగ్ అధికారులు కొన్ని లోపాలు చేయడంతో ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని రవాణా, పోలీసు, అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించిన చోట్లలో ఫ్లెఓవర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ముంబై – మచిలీపట్నం 65వ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసినా.. ప్రమాదాలు తగ్గడం లేదు. లోపభూయిష్టంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి రక్తమోడుతున్నది. తెలంగాణలోని సంగారెడ్డి నుంచి కర్ణాటక సరిహద్దులో ఉన్న చెరాగ్పల్లి గ్రామ శివారు వరకు 70 కిలోమీటర్లు మేర జాతీయ రహదారిని రూ.1266.60 కోట్లతో విస్తరించారు. మునిపల్లి మండలం కంకోల్ శివారులో టోల్గేట్ ఏర్పాటు చేసి వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మాణం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జహీరాబాద్, సదాశివపేట పట్టణాల సమీపంలో బైపాస్ రోడ్లు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం ఎల్అండ్టీ కంపెనీకి అప్పగించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఇంజినీరింగ్ అధికారులు కొన్ని లోపాలు చేయడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా, పోలీసు, అధికారులు గుర్తించారు. కాగా, 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పలుమార్లు పోలీసు, రవాణా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ, పనులు చేపట్టలేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
టోల్గేట్ల ఏర్పాటు…
జాతీయ రహదారి 65-పై కంకోల్, కర్ణాటకలోని మంగళగిరి శివారులో టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. నిర్వాహకులు 25 ఏండ్ల పాటు టోల్ వసూలు చేసేందుకు కేంద్రం అనుమతించింది. జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మాణం చేసి గ్రామాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, విశ్రాంతి భవనాలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. విస్తరణతో ఈ జాతీయ రహదారి రూపురేఖలు మారాయి. ఈ జాతీయ రహదారిని 1956లో నిర్మించారు. మొదట్లో 9వ నంబర్ జాతీయ రహదారిగా పిలిచేవారు. ప్రస్తుతం 65 నంబర్ జాతీయ రహదారిగా కేంద్రం మార్చింది. సంగారెడ్డి నుంచి కర్ణాటక సరిహద్దులో ఉన్న చెరాగ్పల్లి వరకు 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరణకు 617 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించారు. జాతీయ రహదారి విస్తరణలో 30 గ్రామాలకు చెందిన 3500 మంది రైతులు భూములు కోల్పోయారు. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి శివారు నుంచి రంజోల్, పస్తాపూర్, జహీరాబాద్ నుంచి జాతీయ రహదారిని పాత ఆర్టీవో చెక్పోస్టు వద్ద కలిపారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలివే…
65వ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్, జహీరాబాద్ పట్టణ సమీపంలోని అల్గోల్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించలేదు. దీంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు ఆయా ప్రాంతాల్లో 9నెలల్లో 15 మంది చనిపోయారు. 60 మందికి గాయాలైన సంఘటనలు ఉన్నాయి. రోడ్డు నిర్మాణం సమయంలో అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని ఎల్అండ్టీ ఇంజినీరింగ్ అధికారులు, నేషనల్ హైవే అథారిటీ ఇంజినీరింగ్ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత దానిని విస్మరించారు. మునిపల్లి మండలం లింగంపల్లి చౌరస్తా, కోహీర్ మండలం కొత్తూర్(డి), చింతల్ఘాట్ చౌరస్తా, మద్రి చౌరస్తా, జహీరాబాద్ మండలం హుగ్గెల్లి చౌరస్తా, బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్, మాడ్గి చౌరస్తాల వద్ద ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చౌరస్తాల వద్ద ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తున్నది. కొన్ని గ్రామాల్లో జాతీయ రహదారి వెంట సర్వీస్ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు వెలిగించడం లేదు. దీంతో రోడ్టుపై రాకపోకలు సాగించే వారు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.