సంగారెడ్డి, మే 20 : అసలే కరోనా కాలం.. ఆదమరిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి… కరోనాతో తల్లి, తమ్ముడిని పోగొట్టుకుని పుట్టెడు దుఖఃంతో ఉంది. ఉద్యోగ బాధ్యతలో సెలవు మంజూరు చేయాలని అసిస్టెంట్ అకౌంట్ అధికారి దశరథ్ (ఏఏవో)ను వేడుకున్నది. కరోనా వస్తే నీ విధులు నేను నిర్వహించాలా.. అదేం కుదరదు.. వెంటనే విధుల్లో చేరితేనే జీతం వస్తది.. లేకుంటే రెండు, మూడు నెలలు పడుతదని వేధింపులకు దిగాడు. ఇప్పటికీ ఆ మహిళా ఉద్యోగి ప్రస్తుతం హోంక్వారంటైన్లోనే ఉంది. తల్లి, తమ్ముడిని కోల్పోయి దుఖఃంలో ఉన్న మహిళా ఉద్యోగి విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులకు తన గోడును వివరించింది. సహచర ఉద్యోగులు ఆమెకు భరోసా కల్పించారు. గురువారం జిల్లా విద్యుత్ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ రవి కుమార్ను కలిసి మహిళా ఉద్యోగి పట్ల అకౌంట్ అధికారి వ్యవహరించిన తీరును వివరించారు. అసిస్టెంట్ అకౌంట్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్-327 సంఘం నాయకులు ప్రభాకర్, భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకుని కరోనా బాధితురాలైన మహిళా ఉద్యోగికి సెలవులు మంజూరు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేకపోతే ఉద్యోగులతో కలిసి ఉద్యమం చేయడానికి వెనకడాబోమని చెప్పారు. ఎస్ఈకి ఫిర్యాదు చేసిన వారిలో యూనియన్ నాయకులు వీరయ్య, గోవింద్ రాజు, ఈశ్వరప్ప, నబీ, శ్రీనివాస్ రావు, లింగం, శ్రీనివాస్, లక్ష్మి, నర్సమ్మ, సోని, జ్యోతి తదితరులు ఉన్నారు.