సంగారెడ్డి, మే 16 : అక్రమ ఇసుక ఫిల్టర్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలపై వచ్చిన సమాచారంతో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో ఫిల్టర్లను కూలగొట్టారు. ఆదివారం అధికారుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట, కంది మండలం బ్యాతోల్, ఎర్దనూర్ గ్రామాల శివార్లల్లో అక్రమ ఇసుక ఫిల్టర్లపై వచ్చి సమాచారంతో అధికారులు జేసీబీ యంత్రం సహాయంతో అక్రమ ఫిల్టర్లను ధ్వంసం చేశారు. రూరల్ ఎస్ఐ సుభాశ్, కంది గిర్దావర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఫిల్టర్లను నేలమట్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక ఫిల్టర్లు నడిపితే పీడీ యాక్టు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఫిల్టర్ల యజమానులు, వాహనాల డ్రైవర్లు, కూలీలపై కేసులు పెట్టి రిమాండ్ చేస్తామన్నారు.
రెండు లారీలు సీజ్..
అక్రమ ఇసుక క్వారీల నుంచి తరలిస్తున్న ఇసుక లారీలును రెవెన్యూ అధికారులు, రూరల్, ఇంద్రకరణ్ ఎస్ఐల బృందం ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేసి రెండు లారీలను సీజ్ చేశారు. ఒకరోజు వ్యవధిలోని యథేచ్ఛగా అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్న ఫిల్టర్లను ధ్వంసం చేశారు. దీంతో అక్రమార్కులకు కనువిప్పు కలుగాలని, అధికారులు కోరుతున్నారు. ఆయా గ్రామాల ప్రజల పక్కా సమాచారంతో అధికారులు స్పందించి ఫిల్టర్లను నేలమట్టం చేసిన త్వరలోనే మళ్లీ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటారని పలు గ్రామాల ప్రజలు గుసగుసలాడటం మరో విశేషం. అధికారులు నిరంతరంగా అక్రమ ఇసుకపై పక్కా నిఘా పెడితేనే అరికట్టడం సాధ్యమవుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.