కల్హేర్, మే 16 : ఇంటింటి ఆరోగ్య సర్వే సఫలం అయిందని, కరోనా నిబంధనలు పాటిస్తే మహమ్మారిని నియంత్రించవచ్చని, కరోనా సోకిన వారు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రమైన కల్హేర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీశారు. దవాఖానలో కిట్లు, వ్యాక్సిన్, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఇంటింటి ఆరోగ్య సర్వే అమలు చేయడంతో సఫ లం అయిందని కొనియాడారు. రాష్ట్రం లో అమలు చేసిన సర్వేను దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కొనసాగించాలని ప్రధాన మంత్రి సూచించారన్నారు. సర్వేతో కరోనా కేసులు తగ్గుతున్నాయని, వివిధ శాఖల అధికారులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ జ్వర పీడితులను గుర్తించి ఐదు రోజుల కిట్ అందిస్తున్నారన్నారు. కరో నా బాధితులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా నారాయణఖేడ్లోని ప్రభుత్వ దవాఖానలో 30 పడకల ఆక్సిజన్ బెడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రభు త్వ దవాఖానలో సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రజలకు, కరోనా రోగులకు అందిస్తున్న, అందుతున్న వైద్య సేవలపై ప్రభుత్వ వైద్యులతో మాట్లాడి తెలుసుకుంటున్నామన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని ఎమ్మెల్యే కోరారు.