సంగారెడ్డి/సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 12: రోగులను సొంతబిడ్డల్లా చూసుకుంటున్న నర్సులు దేవుడిచ్చిన అమ్మలాంటి వారు. వైద్యం అందించే డాక్టర్లను దైవంతో సమానంగా కొలిచే ఈ సమాజంలో నర్సుల సేవలను గుర్తు చేసుకుని దినోత్సవం జరుపుకోవడం మంచి పరిణామమని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ దవాఖానలోని నర్సులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కరోనా బాధితులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కొవిడ్-19 ప్రత్యేక వార్డును సందర్శించి త్వరగా కోలుకోవాలని రోగులకు, మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను జడ్పీ చైర్పర్సన్ సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుటుంబాలకు తల్లితండ్రుల సేవలతో పిల్లల సంరక్షణ ఎలా జరుగుతుందో వ్యాధిగ్రస్తులకు వైద్యులు, నర్సులు సేవలు అంతకన్నా గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, నర్సులు విజయకుమారి, చంద్రకాంత్, తుల్జమ్మ, శాంత, బాలనాగమ్మ, శంకరమ్మ, కవిత, లత, రాధిక తదితరులు పాల్గొన్నారు.