హత్నూర, జూన్ 5 : ‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. హత్నూర మం డలం కాసాల గ్రామం పల్లెప్రగతిలో అభివృద్ధిని సాధిస్తూ ఆదర్శం వైపు ముందుకు వెళ్తున్నది. గ్రా మంలో సుమారు రూ.1కోటితో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
గ్రామ స్వరూపం..
కాసాల గ్రామంలో 12 వార్డులు 832 నివాస గృహాలు ఉన్నాయి. గ్రామంలో మొత్తం జనాభా 3,789. మహిళలు 1,898, పురుషులు 1891. పారిశుధ్య కార్మికులు 7 మంది. 6 వాటర్ ట్యాంకులు, 3 అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల. 1 పెద్ద చెరువు, 4 కుంటలు. 3,662 ఎకరాల భూవిస్తీర్ణం ఉండగా, అందులో సాగుకుయోగ్యమైనది 2,579 ఎకరాలు. 1188మంది రైతులు ఉన్నారు.
ఆదర్శంగా రైతువేదిక..
జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కాసాల గ్రామ శివారులో అధునాతన హంగులతో రైతువేదికను నిర్మించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో మంది వచ్చి రైతువేదికను చూసివెళ్లారు. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు నిరంతరం పర్యవేక్షించి రైతువేదిక నిర్మాణాన్ని పూర్తిచేయించారు. రైతు వేదికను మంత్రి హరీశ్రావు సందర్శించి అభినందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.22లక్షలతో పాటు అదనంగా మరో 22లక్షల నిధులు వెచ్చించి అధునాతన హంగులతో నిర్మాణం చేపట్టారు. బండి చక్రంపై చిరుధాన్యాలను ముద్రించి ముగ్గురు రైతులు చేతులతో పైకెత్తిచూపుతున్న విగ్రహాలు ఆకర్షణీంగా ఉన్నాయి.
రూ.35లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం..
గ్రామంలో సుమారు రూ.35లక్షలతో మురుగు కాల్వల నిర్మా ణం చేపట్టారు. రూ.11లక్షల 60వేలతో అండర్గ్రౌండ్ నిర్మాణం పనులు చేపట్టారు.
పాడుబడ్డ ఇండ్ల కూల్చివేత..
గ్రామంలోని ఎనిమిది పాడుబడ్డ ఇండ్లను కూల్చివేశారు. రెండు పురాతన బావులు పూడ్చేశారు. పల్లెప్రగతిలో ఊరంతా కలిసి శ్రమదానంతో రోడ్లుశుభ్రం చేసి పిచ్చిమొక్కలు తొలిగించారు.
ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు
పంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన నిధులతో రూ.13లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. నిరంతరం ట్యాంకర్తో హరితహారం మొక్కలకు నీటిని అందజేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేస్తూ పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.
వైకుంఠధామం నిర్మాణం..
గ్రామ శివారులో వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణ పనులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చారు. గ్రామంలోని చెత్తను డంపింగ్యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరుచేస్తున్నారు. వైకుంఠధామం పక్కనే ప్రకృతివనం ఏర్పాటుచేసి వెయ్యి మొక్కలు పెంచుతున్నారు. నర్సరీలో 11 వేల మొక్కలు పెంచుతున్నారు.
డివైడర్పై 400 మొక్కల పెంపకం..
కాసాల, దౌల్తాబాద్ శివారులోని ప్రధాన రహదారిపై నిర్మించిన డివైడర్పై 400 మొక్కలు నాటి నిరంతరం ట్యాంకర్తో నీటిని అందిస్తున్నారు. మొక్కలకు చుట్టూ ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తాం
గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధిని సాధిస్తాం. అంతర్గత డ్రైనే జీ, మురుగు కాల్వల నిర్మా ణం చేపట్టాం. మొక్కలకు నిరంతరం నీరు పడుతూ పెంచుతున్నాం. ఇద్దరు దా తల సహకారంతో నాలుగు బోర్లు తవ్విం చాం. గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్న ఎమ్మెల్యే మదన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
రాణీరాంరెడ్డి, సర్పంచ్, కాసాల
ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు
గ్రామంలో ప్రభుత్వ పథకాలను పక్కాగా అమ లు చేయడానికి కృషిచేస్తున్నాం. నిరంతరం పారిశుధ్య చర్యలపై దృష్టిసారించి పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పుతున్నాం. ప్రజల సహకారంతో గ్రామానికి మంచి గుర్తిం పు తీసుకువస్తాం.
విజయలక్ష్మీవెంకటేశంగుప్తా, ఎంపీటీసీ, కాసాల