సంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పంచాతీరాజ్ రహదారుల మరమ్మతులు, బీటీ రెన్యువల్ పనులకు రూ.250 కోట్లు విడుదల చేశారన్నారు. ఆర్అండ్బీ రహదారుల బీటీ రెన్యువల్, మరమ్మతులకు రూ.93 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు త్వరలో టెండర్లు నిర్వహించి ఆరు నెలల్లో రోడ్డు మరమ్మతులు, బీటీ రెన్యువల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో ఆర్అండ్బీ ఎస్ఈ సర్కిల్ మాత్రమే ఉందని, పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయం లేదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయం మంజూరు చేసినట్లు చెప్పారు. సంగారెడ్డిలో త్వరలోనే పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. దీంతో రహదారుల నిర్మాణ పనులు వేగవంతం కానున్నట్లు పేర్కొన్నారు.
228 పనులకు రూ250 కోట్లు
సంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్ రహదారుల మరమ్మతులు, బీటీ రెన్యువల్ 228 పనులకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించి, పనులు పూర్తి చేయించాలని కలెక్టర్ శరత్కు సూచించారు. ఈజీఎస్ ద్వారా జిల్లాల్లో 134 పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.26.60 కోట్లు విడుదల చేసిందన్నారు. నిధులు విడుదలై నెల రోజులు దాటినా ఇంకా పనులు ఎందుకు ప్రారంభించలేదని పంచాతీరాజ్, డీఆర్డీఏ అధికారులను మంత్రి ప్రశ్నించారు. కలెక్టర్ శరత్ స్పందిస్తూ పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేలు కొన్ని సవరణలు సూచించారని, అందుకే ప్రారంభించలేదని తెలిపారు. తన నియోజకవర్గంలో పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేస్తానని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు. పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన మండలాల్లో మండల పరిషత్ భవనాల నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా మండల పరిషత్, గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో జరిగే ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు. డిసెంబర్లో సంగారెడ్డి జిల్లాలో 86 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయన్నారు. గర్భిణులకు అవసరమైన టిఫా స్కానింగ్ యంత్రాలను సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నారాయణఖేడ్, జహీరాబాద్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
త్వరలోనే ఖాళీల భర్తీ
ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో ఖాళీ పోస్టులు ఉంటే త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, బాలామృతం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 177 హెల్పర్, 27 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇంకా 73 హెల్పర్, 19 మంది టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీలను ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలోకి మార్చాలని మంత్రి, కలెక్టర్ శరత్కు సూచించారు. సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, మాణిక్రావు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, జిల్లా అధికారులు, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు మల్లికార్జున్ పాటిల్, రాజు రాథోడ్, ప్రభాకర్, ఆంజనేయులు, రమేశ్, నర్సింహరెడ్డి, ఎంపీపీలు కృష్ణవేణి, చైతన్య, సరళ తదితరులు పాల్గొన్నారు.