రామచంద్రాపురం, మార్చి21 : రవాణా వ్యవస్థ మెరుగుతోనే గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ నుంచి ఈదులనాగులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు రూ.4.5కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్పర్సన్ మల్లేపల్లి లలితాసోమిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్కు చేరువలో తెల్లాపూర్ ఉండడంతో ఇక్కడికి సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్కువగా వస్తుండడంతో జనాభ బాగా పెరుగుతుందన్నారు. జనాభాకు అనుగుణంగా పూర్తిస్థాయిలో మౌలికసదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలకు రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు తెల్లాపూర్ నుంచి ఈదులనాగులపల్లి వరకు రెండు రేడియల్ రోడ్లను తీసుకురావడం జరిగిందని, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
కొల్లూర్ తండా నుంచి ఈదులనాగులపల్లి వరకు మరో బీటీ రోడ్డుని వేయిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీపడకుండా పనిచేస్తుందన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో వైస్చైర్మన్ రాములుగౌడ్, ఏఎంసీ వైస్చైర్మన్ మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, కౌన్సిలర్లు మయూరిరాజుగౌడ్, చిట్టిఉమేశ్వర్, రవీందర్రెడ్డి, శ్రీశైలం, కోఆప్షన్ సభ్యులు జయలక్ష్మి, శ్రీపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.