కోహీర్, అక్టోబర్6 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మద్రి గ్రామంలో ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినంకా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని చీరెల పంపిణీ చేస్తున్నారని వివరించారు.
చీరెల తయారీ కోసం రూ.350కోట్లను కేటాయించారని దీంతో 16వేల మందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. బతుకమ్మ పండుగలాగే క్రిస్మస్, రంజాన్ పండుగకు నిరుపేదలకు బట్టలను అందజేస్తున్నామని చెప్పారు. గ్రామంలో సీసీ రోడ్లు, మద్రి జాతీయ రహదారి నుంచి హుగ్గెల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.