సంగారెడ్డి కలెక్టరేట్ : ఓటరు జాబితాలోని లాజికల్ తప్పులు, ఫామ్ 6, 6ఏ, 7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్కు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ రోల్ మేనేజ్మెంట్, డ్రాప్ అవుట్ పబ్లికేషన్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, స్వీఫ్ యాక్టివిటీస్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ నాన్ ఫొటో ఓటర్ల జాబితాను సవరించాలన్నారు. డ్రాప్ అవుట్ పబ్లికేషన్స్కు ముందే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్లకు సంబంధించి నోటీసులు ఇచ్చి తొలగించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టాలన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500కు పైగా ఓటర్లు ఉన్నట్టయితే అదనంగా కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా గ్రామ స్థాయి వరకు ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఆయా విషయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సీఈఓకు తెలిపారు.
అనంతరం జిల్లాలోని ఆర్డీవోలు, సంబంధిత సిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటరు జాబితాలను ఇప్పటి నుంచే సరిచేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు డూప్లికేట్, చనిపోయిన ఓటర్లను తొలగించాలన్నారు. నిర్ణీత సమయంలో క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 1500 ఓటర్లు దాటితే కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. ఆయా విషయాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు నగేశ్, రమేశ్బాబు, అధికారులు వెంకటేశ్, పాషా, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.