పటాన్చెరు, మే 11 : అభివృద్ధిలో పాశమైలారం గ్రామం ఆదర్శం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో వేస్తున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాశమైలారం ఒకప్పుడు మారుమూల గ్రామం అన్నారు.
ఇప్పుడు అతి పెద్ద పారిశ్రామికవాడ ఏర్పాటుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న గ్రామం అన్నారు. పరిశ్రమల రాకతో గ్రామం దశమారిందని ఆయన పేర్కొన్నారు. కరెంటు కోతలతో కళావిహీనంగా మారిన పారిశ్రామికవాడలకు జీవం పోసింది తెలంగాణ సర్కార్ అన్నారు. ఇప్పుడు నాణ్యమైన కరెంట్ సరఫరాతో పారిశ్రామికవాడలు వెలిగిపోతున్నాయని ఆయన తెలిపారు.
పాశమైలారం గ్రామం అభివృద్ధికి పుష్కలమైన నిధులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజ, పాశమైలారం ఉప సర్పంచ్ కృష్ణ,మాజీ సర్పంచ్లు సుధాకర్గౌడ్, చంద్రయ్య, పాండు, కార్యదర్శి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.