జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులలో ఒకటైన జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) నారింజ వాగు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షాకాలంలో కురిసే వర్షాలతో నారింజ వాగు ప్రాజెక్టులోని జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల పరిధిలోని వాగులు, వంకలు, చెక్డ్యాంల ద్వారా వరద నీరు భారీగా తరలివస్తుంది.
ఫలితంగా ప్రాజెక్టు గేట్ల మీదుగా వరద నీరు కర్ణాటక వైపు తరలివెళ్తుంది. జహీరాబాద్ ప్రాంతంలోనే పుట్టినా నారింజ వాగు ఇక్కడి రైతులకు ఉపయోగపడుతున్నది చాలా తక్కవ. సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన కాలువలు సక్రమంగా లేకపోవడంతో చివరి అయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా కాల్వల ద్వారా అందిస్తే పంటలను పండించుకోవచ్చన్న రైతుల ఆశలు తీరండం లేదు.
ప్రాజెక్టులో నుంచి వృథాగా కర్ణాటకకు ప్రాంతానికి తరలిపోతున్న జలాలను కొంత మేర సద్వినియోగం చేసుకునేందుకు జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బి) గ్రామ శివారులో గల నారింజ వాగుపై 1970 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించింది. 1971లో ప్రాజెక్టు కింద 15 కిలో మీటర్ల దూరం కుడి, ఎడవ కాల్వలను తవ్వించి ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద న్యాల్కల్, జహీరాబాద్ మండలాల పరిధిలోని 3,500 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయినప్పటికీ ఏ కాల్వ కూడా సాగుకు అనువుగా లేకుండా పోయింది. దీంతో ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో గుంట భూమికి సాగునీరు పారిన దఖలాలు లేవు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ ఉంది. గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన జన్మభూమి, జలయజ్ఞం, మిషన్ కాకతీయ ఫథకాలు కూడా ప్రాజెక్టు దశను మార్చలేకపోయాయి. దీంతో ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు వరదనీటితో నిండిపోయి గేట్లపై నుంచి వృథాగా కర్ణాటకవైపు వెళ్తుంది.
ఈ నీరు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలోని కరింజ వాగు ప్రాజెక్టులోని చేరుతుంది. అక్కడి రైతులకు సాగుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.5.77 కోట్లతో ప్రాజెక్టు షటర్లు, కట్ట మరమ్మత్తులను చేయించింది. 2015 సంవత్సరంలో ప్రాజెక్టు కింద అయకట్టుకు నీరందించేందుకు కుడి, ఎడవ కాల్వల మరమ్మత్తుల పనులు అసంపూర్తిగా చేపట్టి వదలివేశారు. మూడు సంవత్సరాల క్రితం రూ.18 లక్షలతో ప్రాజెక్టులో పూడికతీత పనులు నామమాత్రంగానే చేశారు.
వివిధ కారణాలతో ప్రాజెక్టును పట్టించుకోకపోవడం, కాల్వల నిర్మాణం తదితర మరమ్మత్తు పనులను చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాంత రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోతుంది. ప్రతి ఏటా ప్రాజెక్టులోకి వరద నీరు రావడం.. వృథాగా కర్ణాటక వైపు వెళ్లిపోవడం జరుగుతోంది. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టాలని వినతి పత్రాన్ని అందజేశారు.
సంబంధిత అధికారులు ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రూ.14 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడంతో ఆయా మండలాల రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ప్రభుత్వం ప్రాజెక్టు పూడికతీత, మరమ్మత్తులకు నిధులను మంజూరు చేయలేదు. వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైనా ప్రాజెక్టులో పూడికతీత, మరమ్మత్తు పనుల ఊసేలేకపోవడం రైతులను నిరాశపరిచింది. అయినప్పటికీ దశాబ్దాలుగా ప్రాజెక్టు కింద ఆయకట్టు సాగుకు నోచుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు వృథాగా పోతున్న వరదనీటిని అరికట్టి, ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టి, కాల్వలకు మరమ్మతు పనులు చేయించి సాగుకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.