సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 24: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి ఇంజినీరింగ్ శాఖ, ఆయా శాఖల అధికారులతో మంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జహీరాబాద్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవన ప్రారంభం, హోతి(కె) శివారులో షాదీఖానా, మినీ హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన, పీఆర్, ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభానికి ఆయా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా పనులకు సంబంధించి ఏవేని పనులు మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేసి సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో అధికారులు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.