పటాన్చెరు, ఏప్రిల్ 15: తిమిటీ జే.లించ్, అంతర్జాతీయ అసోసియేట్ డీన్, మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా నేతృత్వంలో ఎనిమిదిమంది సభ్యుల బృందం శుక్రవారం హైదరాబాద్లోని గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. గీతమ్ హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ నేతృత్వంలో గీతం సైన్స్ డీన్ ఎం బాలకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, భౌతిక-రసాయన శాస్త్ర విభాగాధిపతులు ప్రొఫెసర్ రావూరి బాలాజీరావు, డాక్టర్ సురేంద్రబాబు, బీఎస్సీ బ్లెండెడ్ సమన్వయకర్తలు డాక్టర్ సాయిప్రీతి, డాక్టర్ శ్రీమన్నారాయణ, పలువురు అధ్యాపకులు వారితో ముఖాముఖి చర్చించారు.
ముఖ్యంగా మెల్బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో మూడేళ్ల క్రితం ప్రారంభించిన బీఎస్సీ బ్లెండెడ్ కోర్సును సమీక్షించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని అధిగమించాల్సిన తీరువంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేసిన పరిశోధనలను ఆస్ట్రేలియా బృందానికి వివరించి, వారి ప్రశంసాలు అందుకున్నారు. గీతం కోర్సుల నిర్వహన తమకు చాలా నచ్చిందని, ఇండియాలో ఏడు చోట్ల బీఎస్సీ బ్లెండెడ్ కోర్సుకు అనుమతి ఇవ్వగా, పూనే వర్సిటీతో పాటు గీతమ్ పనితీరు, అధ్యాపకుల నిబద్ధత, విద్యార్థుల పురోగతి తమను ఆకట్టుకునట్టు ఆస్ట్రేలియా బృందం అభిప్రాయపడింది.
త్వరలో డ్యూయల్ డిగ్రీ లేదా డబుల్ డిగ్రీ కోర్సులను ప్రారంభిస్తామని, అది రెండేళ్లు గీతమ్లో, చివరి రెండేళ్లు మెల్బోర్న్లో పూర్తి చేయవచ్చన్నారు. భారతీయ విద్యార్థులు సొంతడబ్బుతో కాకుండా, కొద్దిపాటి మొత్తంతోనే ఆస్ట్రేలియాలో వచ్చి చదువుకోవచ్చని, 20శాతం సమయాన్ని పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం వెచ్చించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పూనే విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ మాధవరావు పాల్గొన్నారు.