సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని టీఎస్డబ్ల్యూఐడీసీ కార్యాలయంలో మన ఊరు -మన బడి కింద జిల్లాలో సంబంధిత శాఖలకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖకు 87 పాఠశాలలు కేటాయించారని, 38 పాఠశాలల పనులు పూర్తి కావచ్చాయని, ఈ నెల 31లోగా ఆయా పాఠశాలల పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మిగతా పాఠశాలలకు సంబంధించి త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, పనులు ప్రారంభించడం జరుగాలని ఇంజినీర్లకు సూచించారు. ఆయా పాఠశాల పనులు జూన్లో పాఠశాలల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నారు. అనంతరం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో చేపట్టిన పలు పాఠశాలల పనులను ఆయన పరిశీలించారు.
సంగారెడ్డిలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిని, ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో నిర్మించిన నీటి సంపు నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, ఆయా పనుల పురోగతి, నాణ్యతపై చైర్మన్ సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈఈలు, ఏఈలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు.