– కొర్రీలతో, ప్రాముఖ్యత పేరుతో పెన్షన్లు మంజూరు చేస్తే ఉద్యమం తప్పదు
– కొత్తగూడెం 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్
రుద్రంపూర్ ఆగస్టు 08 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న అందిస్తామంటున్న నూతన సామాజిక పెన్షన్లను ఎలాంటి కొర్రీలు, ప్రాధాన్యత క్రమం కాకుండా అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని కొత్తగూడెం 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. శనివారం డివిజన్ లో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో ఆగస్టు 15న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తారని వస్తున్న వార్తలు చూసి ప్రజలు సంతోషిస్తున్నారని, వారి సంతోషంపై నీళ్లు చల్లవద్దని, పెన్షన్ల మంజూరు చేస్తామని ఊరిస్తూ ప్రాధాన్యత క్రమం అంటూ అరకొర పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క డివిజన్లో 100 నుండి 150కి పైగా అన్ని రకాల పెన్షన్ దారులు అర్హులుగా ఉన్నారన్నారు. కేవలం డివిజన్ కు 15 నుండి 20 పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె అన్నారు.
అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే ప్రజలందరినీ సమీకరించి ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటులో మొదటి సంతకమే వికలాంగులకు రూ.6 వేలు, ఇతరులకు రూ.4 వేలు ఇస్తామని నేటికి పెంచిన పెన్షన్ ఇవ్వకపోవడం లబ్ధిదారులను మోసం చేసినట్టేనన్నారు. అర్హులైన వారందరికీ తక్షణమే సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, నాయకులు కాంపల్లి దుర్గయ్య, కాంపెల్లి పుష్ప, కాండ్రేగుల సత్యవతి, దొంగ నాగమణి, ప్రశాంత్ పాల్గొన్నారు.