సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6 : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు, నిమ్జ్ ప్రాజెక్టు, జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూ సేకరణ పురోగతి, భూసేకరణ జాప్యానికి గల కారణాలు, ఆయా ప్రాజెక్టుల కింద ఫైనల్ అవార్డుల పరిస్థితి, పెండింగ్లో ఉన్న చెల్లింపులు, తదితర అంశాలపై ఆయా ప్రాజెక్టుల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. వివిధ ప్రాజెక్టులలో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరగొద్దని తెలిపారు. న్యాయం జరిగేలా చూడాలన్నారు. అవార్డ్ పాసైన వాటికి చెల్లింపులు చేయాలని సూచించారు. క్లియర్గా ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేయాలని రెవెన్యూ డివిజినల్ అధికారులకు ఆదేశించారు.
పెగ్ మార్కింగ్ చేయాలని, సర్వే లాండ్స్ రికార్డ్స్, రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నీటి పారుదల, ఆర్ఆండ్బీ, జాతీయ రహదారులు, టీఎస్ఐపాస్, నిమ్జ్, సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.