రామగిరి, ఆగస్టు 08 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్స్తో ఉద్యోగంలో చేరి కొనసాగుతున్న వారి భాగోతం వెలుగు చూసింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ బాధలు చూసిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జూనియర్ లెక్టరర్స్ను రెగ్యూలర్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో పలువురు నకిలీ సర్టిఫికెట్స్తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. వీరు ఇతర రాష్ట్రాలోని పలు యూనివర్సిటీల్లో పీజీ, ఇతర కోర్సులు పూర్తి చేసినట్లు వాటిని ఇంటర్మీడియేట్ బోర్డుకు అందచేసి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుంది. వీరిని గుర్తించిన ఇంటర్మీడియేట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 37 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు ఉండటం గమనార్హం. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజీక్స్ అధ్యాపకురాలు, సూర్యాపేట, కోదాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్జెక్టులు బోధించే మహిళా అధ్యాపకురాలు, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోటని అధ్యాపకుడికి నోటీసులు అందినట్లు సమాచారం. వీరంతా వారం రోజుల్లోగా ఇంటర్మీడియేట్ బోర్డుకు పూర్తి ఆధారాలను సమర్పించాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. అధ్యాపకులు ఇచ్చే సమాదానం ఆధారంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.