మునిపల్లి,మే 16 : ప్రభుత్వ బడి అమ్మ ఒడి లాంటిదని..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, సౌకర్యాల కల్పన కోసం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశ పెట్టిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంతో పాటు పెద్దగోపులారం,చిన్నచెల్మెడ, అల్లాపూర్, మేళాసంగం, కంకోల్ గ్రామాల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల మరమ్మతులకు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు కమకూరుతాయని చెప్పారు. మొదటి విడుతలో భాగంగా మండలంలోని (9)ప్రభుత్వ పాఠశాలలకు ఎంపిక చేసి నిధులు విడుదల చేశామన్నారు.
పాఠశాలలో తాగు నీరు, మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక గదులు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీ, పాఠశాలల పరిసరాల పరిశుభ్రత లాంటి అనేక మౌలిక సాదుపాయాలు ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శైలజ జడ్పీటీసీ మీనాక్షి,మండల పార్టీ అధ్యక్షులు సతీష్,ప్రధాన కార్యదర్శి శశికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్,ఎంపీటీసీలు ఉన్నారు.