నారాయణఖేడ్, నవంబర్ 24 : నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ వారి ప్రాణాలను కాపాడుకుంటున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మనూరు మండలం బాదల్గామ గ్రామానికి చెందిన ప్రణీత్ వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ.4 లక్షల ఎల్వోసీని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలు మెరుగైన వైద్య చికిత్సల కోసం అవసరమైన ఆర్థిక స్థోమత లేని పరిస్థితుల్లో ముందస్తుగా ఎల్వోసీ మంజూరు చేయడం ద్వారా వారికి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడుతున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో వందలాది మందికి అత్యవసర పరిస్థితుల్లో లక్షలాది రూపాయల ఎల్వోసీలను మంజూరు చేసి ఆదుకోవడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.