సంగారెడ్డి, జనవరి 14(నమస్తే తెలంగాణ): కరెంటు రాక.. సాగు నీరు లేక.. అప్పులు దొరక్క విలవిలలాడిన అన్నదాత రాత స్వరాష్ట్రంలో మారిపోయింది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయం పండుగలా మారింది. ఉమ్మడి పాలనలో దండుగన్న వ్యవసాయం కేసీఆర్ పాలనలో సంబురమైంది.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు వారి పాలిట వరంగా మారుతున్నాయి. రైతుబంధు, ఉచిత విద్యుత్, రైతుబీమా, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది.
గణనీయంగా పెరిగిన సాగు
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలతో సంగారెడ్డి జిల్లాలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. నిరంతర ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు పథకాలతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఏడాది పొడవునా పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో సమకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రైతులకు సకాలంలో పంట రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతున్నది. గతంలో వానకాలంలో 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. ప్రస్తుతం ఈ సీజన్లో 7.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. యాసంగి సీజన్లో గతంలో 60వేల ఎకరాల్లో సాగయ్యే పంటలు ప్రస్తుతం 1.50 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంటల సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నది. ఫలితంగా పంటల దిగుబడి పెరిగి రైతులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.
రైతుబంధుతో అప్పుల బెడద తప్పింది
సీఎంకేసీఆర్ రైతుల కోసం రైతుబంధు పథకం అమలు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నారు. జిల్లాలో 2018 నుంచి వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2018 నుంచి 2022 వరకు తొమ్మిది విడతల్లో రూ.2906.98 కోట్లు జమయ్యాయి. యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 2.62 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.182 కోట్లు జమయ్యాయి. దీంతో రైతులు ప్రైవేటు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పింది.
రైతు కుటుంబాలకు అండగా రైతుబీమా
రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. రైతు మృతిచెందితే బీమా డబ్బులు రూ.5 లక్షలు అందజేస్తున్నారు. జిల్లాలో రైతుబీమా పథకం కింద 2,80,503 మందిని అర్హులుగా గుర్తించారు. 2018 నుంచి 2022 వరకు మృతిచెందిన 5856 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.293.25 కోట్లు అందజేశారు. 2022-23లో మృతిచెందిన 349 మంది రైతుల నామినీ ఖాతాల్లో రూ.17.45 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు కరెంటు కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రైతుల విద్యుత్ కష్టాలు తీరాయి. జిల్లాలో 99,616 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రోజూ 3.94 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బోరుబావులు, బావులకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
మిషన్ కాకతీయతో జలకళ
సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. ఫలితంగా పొలాలకు సాగు నీరు పెరిగి పంటల విస్తీర్ణం పెరుగింది. మిషన్కాకతీయతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు పూర్వవైభవం వచ్చింది. ఐదు విడతల్లో మిషన్ కాకతీయతో రూ.530 కోట్లతో జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడిక తీశారు. ఫలితంగా చెరువుల, కుంటల కింద లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. నారాయణఖేడ్లో ఎనిమిది కొత్త చెరువులు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.56 కోట్లు విడుదల చేసింది. సింగూరు ప్రాజెక్టుతో 40 వేల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందిస్తున్నది. సింగూరు ప్రాజెక్టు కాల్వలు ఇతర నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.132 కోట్లు విడుదల చేసింది. నల్లవాగు ప్రాజెక్టుతో 6వేల ఎకరాలకు సాగు నీరు అందజేస్తున్నారు.
సంగమేశ్వ, బసవేశ్వరతో జిల్లా సస్యశ్యామలం
సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తీసుకురావాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. జిల్లాకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రెండు ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేశారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజక వర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్, అందోలు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే సంగారెడ్డి జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నది.
చివరి గింజ వరకు కొనుగోలు
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందజేయడంతో పాటు పంట చివరి గింజ వరకూ కొనగోలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నది. దీంతో సీఎం కేసీఆర్ స్పందించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తున్నది. జిల్లాలో జొన్న, మొక్కజొన్న, కందులను ప్రభుత్వం సేకరిస్తున్నది. 2022-23 వానకాలం సీజన్లో 36,213 మంది రైతులు పండించిన 18,67,100 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించింది.
రైతు వేదికలు, గోదాంల నిర్మాణం
రైతు సమావేశాలు, వ్యవసాయశాఖ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాలో 116 రైతు వేదికలు నిర్మించింది. రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు కొత్తగా మరిన్ని గోదాంలు నిర్మిస్తున్నది. జిల్లాలో కొత్తగా 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 22 గోదాంలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందుకోసం రూ.42 కోట్లు ఖర్చు చేస్తున్నది.