సంగారెడ్డి జనవరి 12(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు ఉచితంగా అన్ని రకాల వైద్య సేవలు అందేలా మౌలిక వసతులు కల్పిస్తున్నది. వైద్యుల నియామకాలూ చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. దీంతో పాటు కొత్తగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయనున్నది. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానల్లో కొత్తగా 20 మంది వైద్యులను ప్రభుత్వం నియమించింది. జిల్లా కేంద్ర దవాఖానలో ఉచిత రోగ నిర్థారణ పరీక్షల కోసం టీ డయాగ్నాస్టిక్ హబ్ను ప్రారంభించింది. ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నది. క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు పాలియేటివ్ కేర్ సెంటర్ ప్రారంభించింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) బోధన కళాశాలగా కొనసాగుతున్నది. సంగారెడ్డిలోని జీజీహెచ్కు సంగారెడ్డి జిల్లాతో పాటు పొరుగునే ఉన్న మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి రోగులు వస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారు, ప్రాణాంత వ్యాధులున్న వారు ఈ దవాఖానలో చికిత్స పొందుతుంటారు. వీరిని వైద్యసేవలు విస్తృతంగా అందించేందుకు దవాఖానలో ఐసీయూ, నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆక్సిజన్ యూనిట్ను ఏర్పాటు చేశారు.
50 పడకలతో క్రిటికల్ కేర్ దవాఖాన
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా 50 పడకలతో క్రిటికల్ కేర్ బ్లాక్ను నిర్మించనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23.75 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ముగిసింది. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి క్రిటికల్ కేర్ బ్లాక్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో అధునాతన వైద్య పరికరాలతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు ఈ సెంటర్లో సేవలు అందించనున్నారు.
ఎంసీహెచ్లో తల్లిపాల కేంద్రం
నవజాత శిశువులతో పాటు ఆరు నెలల్లోపు చిన్నారుల ఎదుగుదల, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు తల్లిపాలు ఎంతో అవసరం. కొంత మంది నవజాత శివువులకు తల్లిపాలు సరిపోవు. దీంతో పిల్లలు బరువు తగ్గడంతో అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి పిల్లలకు తల్లి పాలు అందజేసేందుకు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేయనున్నారు. బాలింతల్లో కొంత మందికి పిల్లలకు సరిపడా పాలు ఇచ్చాక కూడా ఎక్కువగా వస్తుంటాయి. అధిక పాలు ఉత్పత్తి అవుతున్న బాలింతలకు చాతి గడ్డలు ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి మిల్క్ బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పించి, అదనంగా వచ్చే తల్లి పాలను సేకరిస్తారు. ఇలా సేకరించి తల్లిపాలను ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి ‘మిల్క్ బ్యాంకు’లో నిల్వ చేస్తారు. మిల్క్ బ్యాంకులో నిల్వ చేసిన పాలను ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అందజేస్తారు. మరీ ముఖ్యంగా ఎన్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న, తక్కువ బరువు ఉన్న, తల్లిపాలు సరిపోక ఇబ్బందులు పడుతున్న శిశువులకు మిల్క్ బ్యాంకులోని పాలు అందజేస్తారు. ఇలా చేయడంతో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల్లో రోగనిరోధక శక్తితోపాటు, ఎదుగుదల, బరువు పెరుగుతారు. సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లిపాల కేంద్రం (మిల్క్ బ్యాంకు) ఏర్పాటు చేయనున్నది. సంగారెడ్డి జీజీహెచ్కు అనుబంధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.9.62 లక్షలతో కొత్తగా ల్యాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ (మిల్క్ బ్యాంకు) ఏర్పాటు చేయనున్నది.
త్వరలోనే శంకుస్థాపనలు
సంగారెడ్డి జీజీహెచ్కు అనుబంధంగా రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ దవాఖాన బ్లాక్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇందుకు ప్రభుత్వ దవాఖాన పక్కనే స్థలం కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుతో ప్రాణాంతక రోగాలు, తీవ్ర గాయాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించి, కాపాడవచ్చు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కొత్తగా తల్లి పాల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు.
– డాక్టర్ అనిల్కుమార్,సూపరింటెండెంట్, జీజీహెచ్, సంగారెడ్డి