సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 15 : వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పూర్తి రక్షణ పొందవచ్చని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ ప్రెసిడెంట్ కస్తూరి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తారా ప్రభుత్వ అటానమస్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1986 వినియోగదారుల చట్టానికి మార్పులు చేస్తూ 2019లో తీసుకొచ్చిన నూతన వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. వినియోగదారులకు ఈ నూతన చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు సైతం రక్షణ పొందవచ్చన్నారు. అయితే వినియోగదారులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన రసీదును విధిగా తీసుకోవాలని సూచించారు.
వినియోగదారులకు గల విశిష్ట హక్కులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో . కమిషన్ సభ్యులు జి వెంకటేశ్వర్లు, విజయ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఏ వెంకటేశం, డాక్టర్ ఉపేందర్, కామర్స్ విభాగధిపతి సంతోషి, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏవీ శర్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.