పటాన్చెరు, జనవరి 8: సమాజ మార్పు కలంతోనే సాధ్యమవుతుందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ), టీయూడబ్ల్యూజేల ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఏర్పాటైన ప్లీనరీని మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రధాన పాత్రను పోషించారన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్కు అల్లం నారాయణ నేతృత్వంలో జర్నలిస్టులు అండగా నిలిచారన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ఐజేయూ ప్లీనరీ హైదరాబాద్లో నిర్వహించడం గర్వపడాల్సిన విషయమన్నారు. ఐజేయూ ప్రతినిధులు హైదరాబాద్ పాత పట్టణం, కొత్త నగరాన్ని, ఇక్కడి గంగాజమున తెహజీబ్ను చూడాలన్నారు. అన్ని వర్గాలకు ఆదరించి ప్రోత్సహించే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జర్నలిస్టు సమాజం నుంచే వచ్చి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.