సంగారెడ్డి : తెలంగాణ సర్కార్ బతుకమ్మ పండుగకు ప్రభుత్వ సారెగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుందని, ఇబ్బందులు తలెత్తకుండా వాటిని పంపిణీ చేయాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ చాంబర్లో జడ్పీ స్థాయి సమావేశాలను నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి , విద్య, వైద్యం, ప్రణాళికలు, పనులు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. స్థాయి సంఘ సమావేశాలకు తొలిసారి హాజరైన అందోల్ శాసనసభ సభ్యులు క్రాంతికిరణ్ను జడ్పీ చైర్పర్సన్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను గౌరవించేందుకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని, పూర్తిస్థాయిలో అర్హులైన ఆడపడుచులకు చీరలు చేరెలా చర్యలు తీసుకోవాలన్నారు.
కరెంటు బిల్లులను తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్ యూనిట్ల ఏర్పాటుకు సబ్సిడీలు ఇస్తుందని, అందుకు అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. ప్రజల్లో వ్యాక్సినేషన్పై ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునేలా చైతన్యం కలిగించాలన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ..ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలకు ఇద్దరూ, ముగ్గురు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులు, పట్టణ ప్రాంతాలకు బదిలీ అయ్యే వారు ముందుగా పరస్పర సహకారం చేసుకుని బదిలీకి దరఖాస్తు పెట్టుకున్న వారికి అవకాశం ఇవ్వాలన్నారు. శిథిలావస్థలో ఉన్నా పాఠశాల గదులలో విద్యార్థులను కూర్చోపెట్టకూడదని సూచించారు. అన్ని రోగాలు గుర్తించే విధంగా డయాగ్నోస్టిక్ హబ్ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సమావేశాలలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య , జడ్పీటీసీ సభ్యులు కుమార్గౌడ్, రాఘవరెడ్డి, కొండల్రెడ్డి, లలిత, సునీత, నర్సింహారెడ్డి, మల్లిఖార్జున్ పటేల్తో పాటు ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.