పేరుకు జాతీయ రహదారులు.. నిర్వహణ లేక నిత్యం ప్రమాదాలే..! సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులను చూస్తే ఇవి హైవేలేనా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ముఖ్యంగా 65వ నేషనల్ హైవేపై ఉన్న గుంతలను చూస్తే గుబులు పుట్టిస్తున్నది. కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మట్టి మేటలు దుమ్ములేపుతూ వాహనాల ప్రమాదాలకు కారణమవుతున్నాయి, ఈ రోడ్డుపై సిగ్నల్స్ ఉండవు, హెచ్చరిక బోర్డులు కనిపించవు.. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇక సర్వీసు రోడ్లు సగం గుంతలమయంగా మారాయి. 161వ జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తి కాకపోవడం, నిర్వహణ సరిగ్గా లేక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సంగారెడ్డి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంది. జిల్లాలోని 65, 161వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 252 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 160 మంది మృత్యువాత పడగా, 221 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను పట్టించుకోవటం లేదు. తమ పరిధిలో ఉన్న రహదారులకు నిధులు విడుదల చేయటంలేదు. రహదారుల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న నిర్మాణ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోవటంలేదు. జాతీయ రహదారుల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ్కుమార్ ఇటీవల నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ సూచించినా నేషనల్ హైవే అథారిటీ వాహనదారుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి కాని ‘161’ పనులు..
సంగారెడ్డి జిల్లాలో 161 నాందేడ్-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో నవంబర్ 22 వరకు రహదారి నిర్మాణం పనులు పూర్తి కావాల్సి ఉన్నది. సంగారెడ్డి జిల్లాలో 120 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి ఉంది. ఇంకా 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ రహదారి నిర్వహణ తీరుపైనా వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జోగిపేట నుంచి సంగారెడ్డి-హైదరాబాద్ వెళ్లేందుకు 161వ నెంబరు జాతీయ రహదారి ప్రధాన మార్గం కావడంతో నిత్యం ఈ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అన్నాసాగర్, అల్మాయిపేట్, చౌటకూర్ క్రాసింగ్, ఎంపీ డిస్టీలరీ (బీరుఫ్యాక్టరీ) సుల్తాన్పూర్ క్రాసింగ్, శివంపేట్ క్రాంసిగ్, శివ్వంపేట్ బ్రిడ్జి వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణ నష్టం సంభవిస్తున్నది. పనులు నత్తనడకన సాగుతుండటం, వాహనాల రాకపోకలు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హెచ్చరిక బోర్డులు లేక కొత్తగా వచ్చే వాహనాలు రాంగ్రూట్లో వెళ్లడం ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పవచ్చు. రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
అధ్వానంగా 65వ జాతీయ రహదారి..
సంగారెడ్డి నుంచి గుల్బర్గా వరకు 65వ జాతీయ రహదారి నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంది. ఈ జాతీయ రహదారి సంగారెడ్డి జిల్లాలో బీహెచ్ఈఎల్ నుంచి ప్రారంభమై చరక్పల్లి వరకు మొత్తం 98 కిలోమీటర్ల మేర ఉన్నది. ఇందులో లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు 31 కిలోమీటర్లు, సంగారెడ్డి చౌరస్తా నుంచి చరక్పల్లి వరకు 67 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. కాగా, రెండేండ్లుగా నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ రోడ్డు మరీ అధ్వానంగా మారింది. బీహెచ్ఈఎల్ నుంచి రుద్రారం గణేశ్గడ్డ వరకు జాతీయ రహదారిపై ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. అశోక్నగర్ నుంచి పటాన్చెరు వరకు సర్వీసు రోడ్లు మాయం అయ్యాయి. పక్కనుంచి వేసిన డ్రైనేజీలు ఉపయోగంలో లేకుండా పూడ్చేశారు. పోచారం చౌరస్తా నుంచి ముత్తంగి జంక్షన్ వరకు జాతీయ రహదారి ఇరువైపులా గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు జాతీయ రహదారిని ఆక్రమించాయి. పాశమైలారం, రుద్రారం పారిశ్రామికవాడల నుంచి వచ్చే వాహనాలు ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చూస్తే ఫికర్ చేయక మానరు.
ట్రాఫిక్ అధికారులు పలురకాల చర్యలకు దిగినా అక్కడ ఎన్హెచ్ 65 అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ రహదారి కుంచించుకుపోయి సమస్య ఏర్పడుతున్నది. గతంలో జాతీయ రహదారిలోకి ఆక్రమణలున్నాయని మార్కింగ్ వేసినా నేటికీ చక్కదిద్దే చర్యలు లేవు. గణేశ్గడ్డ నుంచి సంగారెడ్డి వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. కవలంపేట, కంది, సంగారెడ్డి చౌరస్తా వరకు నిర్వహణ లోపం కారణంగా ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ జాతీయ రహదారి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ఆండ్టీ ఆధ్వర్యంలో కంకోల్ వద్ద టోల్ప్లాజాను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేస్తున్నారు. కానీ, రహదారిపై సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. సత్వార్ చౌరస్తా, బూచినెల్లి చౌరస్తా, బూడిదిపాడు చౌరస్తాలు ప్రమాదకరంగా మారాయి. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదు. దిగ్వాల్ చింతల్, గట్టు కొత్తూరు డీ, లింగంపల్లి చౌరస్తాలవద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి మధ్యలో లైట్లు లేకపోవటం, చాలాచోట్ల సిగ్నల్ బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్, బ్లింకింగ్ లైట్లు లేకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
నిర్వహణకు నిధులు ఇవ్వని కేంద్రం…
65వ నెంబరు జాతీయ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత నేషనల్ హైవే అథారిటీ పరిధిలో ఉంది. 31 కి.మీ ఉన్న ఈ రహదారి నిర్వహణకు ఏటా యాన్యువల్ మెయిటెనెన్స్ కింద రూ.10 లక్షల నిధులు ఇవ్వాల్సి ఉంది. రోడ్డు మర్మమతులు ఇతర నిర్వహణ కోసం ప్రతిఏటా అదనంగా నిధులు కేటాయించాల్సి ఉం ది. రెండేండ్లుగా బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకు రోడ్డు నిర్వహణ, మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటంలేదు. ఈ ఏడాది నేషనల్ హైవేస్ ఇంజినీరింగ్ అధికారులు రహదారి మరమ్మతు పనులు, నిర్వహణ కోసం రూ.4 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు.