సంగారెడ్డి: రాష్ట్రంలో గంజాయి రవాణా, సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మరీ కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంజాయి ఎక్కడ ఉన్నట్లు తెలిసినా వెంటనే రంగంలోకి దిగుతున్నారు పోలీసులు.
ఇప్పుడు తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కూడా ఇదే జరిగింది. ఇక్రిశాట్ టోల్గేట్ వద్ద తనిఖీలు చేసిన అధికారులు 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు.