ఎత్తిపోతలతో సస్యశ్యామలం
లింగాయత్లపై ఉన్న అభిమానంతోనే పథకానికి బసవేశ్వర పేరు
మంత్రి తన్నీరు హరీశ్రావు
నారాయణఖేడ్, ఫిబ్రవరి 16 : నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు 70ఏండ్లు తాగు, సాగు నీటి కోసం గోస పడ్డారని, ఇక ఆ రందీ అవసరం లేదని, రెండేండ్లల్లో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నియోజకవర్గంలోని 1.37 లక్షల సాగు నీరందిస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. సాగు నీరు ప్రజల జీవనాధారామని, సాగునీరొస్తే పేదరికం పారిపోతుందని, నీరు ఎక్కడుంటే అక్కడ నాగరికత ఫరిడవిల్లుతుందనే విషయం తెలిసిన సీఎం కేసీఆర్, రూ.1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతలకు ఈ నెల 21న నారాయణఖేడ్లో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. బుధవారం నారాయణఖేడ్లోని రెహమాన్ ఫంక్షన్హాల్లో స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరందుతుందన్నారు. రాళ్లు, గుట్టలు, లోయలను తలపించే నేలలు ఉన్న నారాయణఖేడ్ ప్రాంతం సస్యశ్యామలం కానున్నదన్నారు. ఇక్కడి ప్రజల తలరాత మారిపోయి బీడు భూములకు సాగునీరందడమే కాకుండా భూముల ధరలు రెట్టింపయ్యే అవకాశముందన్నారు.
భూములు అమ్మాలనుకునే వారు తమ ఆలోచనను విరమించుకోవాలని, భూములు అమ్ముకోవద్దని సూచించారు. లింగాయత్లపై ఉన్న సీఎం కేసీఆర్కు ఉన్న అభిమానంతో ఎత్తిపోతల పథకానికి బసవేశ్వర ఎత్తిపోతల పథకంగా నామకరణం చేయడమే కాకుండా బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. త్వరలో నారాయణఖేడ్లో రూ.3.50 కోట్లతో అధునాతనమైన డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, నాయకులు మాదాసు శ్రీనివాస్, మున్సిపాలిటీ, మార్కెట్కమిటీ పాలకవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రక్తదానం చేయడం ఆనందంగా ఉంది ..
తనకు నచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని తనకు ఇష్టమైన నారాయణఖేడ్లో రక్తదానం చేయడం తనకెంతో ఆనందంగా ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. నారాయణఖేడ్లోని ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం ఆశ వర్కర్లకు మంత్రి హరీశ్రావు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి పాల్గొన్నారు. అలాగే, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని నారాయణఖేడ్ జడ్పీటీసీ లక్ష్మీబాయి-రవీందర్నాయక్ సమ్మక్క సారక్కకు మొక్కుకొని, మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా బంగారం మొక్కు చెల్లించేందుకు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా 10 కిలోల బంగారాన్ని నారాయణఖేడ్ ఆర్టీసీ సిబ్బందికి అందజేశారు.
సీఎం సభాస్థలి కోసం స్థల పరిశీలన
సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ పర్యటన ఖరారైన నేపథ్యంలో బుధవారం సీఎం సభాస్థలిని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను మంత్రి హరీశ్రావు పరిశీలించారు. పట్టణ శివారులోని మనూరు రోడ్డు ప్రాంతంలో, రాయిపల్లి రోడ్డు ప్రాంతంలోని స్థలాలను సందర్శించారు. అయితే మనూరు రోడ్డు ప్రాంతంలోని స్థలంలో సీఎం బహిరంగ సభ నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలపై జిల్లా అధికారులు, నాయకులతో మంత్రి చర్చించారు. పార్కింగ్, హెలిప్యాడ్, సీఎం సభావేదిక, ట్రాఫిక్ తదితర అంశాలపై ఆరా తీశారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతికిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, డీఎస్పీ సత్యనారాయణరాజు ఉన్నారు.