సంగారెడ్డి జూన్ 28 (నమస్తే తెలంగాణ) : వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రతి పంచాయతీలో అన్ని సౌకర్యాలతో శ్మశానవాటికలు ఉండాలని సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 12,769 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠధామాల నిర్మాణం, వందశాతం వినియోగంలో సంగారెడ్డి జిల్లా టాప్లో ఉంది. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు ఉండగా 647 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం వందశాతం పూర్తయ్యింది. అలాగే అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాల వినియోగం ప్రారంభమైంది. మిగతా జిల్లాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైతం వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా ముందంజలో ఉండగా సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వైకుంఠధామాల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాబోయే కొద్దిరోజుల్లో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని పంచాయతీల్లో వందశాతం వైకుంఠధామాలు వినియోగంలోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్ సంకల్పం, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మార్గనిర్ధేశంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు వైకుంఠధామాల నిర్మాణాలను సమీక్షించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో శ్మశానవాటికల సమస్య కనిపించేంది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికలు లేకపోవడం, శ్మశానవాటికలు ఉన్న కొన్నిచోట్ల సరైన సదుపాయాలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతూవచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ ప్రతి పం చాయతీల్లో అన్ని సౌకర్యాలతో వైకుంఠధామాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి అ నుగుణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామాల్లో నీళ్లు, స్నానపుగదులు తదితర సౌకర్యాలు కల్పించటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా టాప్..
వైకుంఠధామాల నిర్మాణం, వినియోగంలో ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 పంచాయతీలు ఉండగా.. 647 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం వందశాతం పూర్తయ్యింది. కలెక్టర్ హనుమంతరావు వైకుంఠధామాల నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధకనబర్చారు. గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం భూసేకరణ మొదలు.. నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు పనులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచనల మేరకు వైకుంఠధామాల నిర్మాణ పనుల్లో సర్పంచ్లు, కార్యదర్శులను భాగస్వాములను చేశారు. తద్వారా గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పనులు వేగంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 647 పంచాయతీలకుగాను అన్ని పంచాయతీల్లోనూ వైకుంఠధామాల నిర్మాణం పూర్తి అయ్యాయి. మరీ ముఖ్యంగా అన్ని పంచాయతీల్లో వందశాతం వైకుంఠధామాల వినియోగం ప్రారంభమైంది. వైకుంఠధామాలు అందుబాటులోకి రావటంతో పంచాయతీల్లోని అన్ని వర్గాల ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారు.
వైకుంఠధామాల్లో అన్ని సౌకర్యాలు ఉండటంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణం పనులు తుది దశలో ఉన్నాయి. జిల్లాలో 499 పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 481 పంచాయతీల్లో నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 481 పంచాయతీల్లో వైకుంఠధామాల వినియోగం ప్రారంభమైంది. మిగతా 18 వైకుంఠధామాలు త్వరలో వినియోగంలోకి రానున్నాయి. మెదక్ జిల్లాలో 469 పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు 417 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మిగతా 52 పంచాయతీల్లో త్వరలోనే పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నారు.
డంపింగ్యార్డుల నిర్మాణం వందశాతం పూర్తి..
ఉమ్మడి మెదక్ జిల్లాలో డంపింగ్యార్టుల నిర్మాణాలు వందశాతం పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో డంపింగ్యార్డు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని పంచాయతీల్లో డంపింగ్యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. డంపింగ్యార్డుల్లో తయారవుతున్న వర్మీ కంపోస్టు ఎరువులను హరితహారంలో నాటిని మొక్కలకు వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో డంపింగ్యార్డుల నిర్మాణం పూర్తి చేశారు. అలాగే సిద్దిపేట జిల్లాలో 849 పంచాయతీల్లో డంపింగ్యార్టుల నిర్మాణం పూర్తయ్యింది. మెదక్ జిల్లాలోని 469 పంచాయతీల్లోనూ డంపింగ్యార్డుల నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.
సమష్టి కృషి ఫలితంగానే పనులు పూర్తి
సమష్టి కృషి ఫలితంగానే సంగారెడ్డి జిల్లాలో వందశాతం వైకుంఠధామాల నిర్మాణం పూర్తి కావటంతోపాటు వినియోగంలోకి తీసుకొచ్చాం. సీఎం కేసీఆర్ సంకల్పబలం, ఆర్థిక మంత్రి హరీశ్రావు మార్గదర్శనంతో సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్గా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతోపాటు నిర్మాణ పనుల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేశాం. దీంతో సకాలంలో వైకుంఠధామాల నిర్మాణం పనులు పూర్తి చేసి వందశాతం వినియోగంలోకి తీసుకురావటంలో విజయం సాధించాం.