ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్’ ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, కార్మికుల్లో మనోధైర్యం నింపుతున్నారు. దీంట్లో భాగంగా సంస్థకు ఆదాయం సమకూర్చే మార్గం చూపారు. ఇప్పటికే కార్గో సర్వీసులను ప్రారంభించిన ఆర్టీసీ వ్యాపార కేంద్రాలకు సరుకులను చేరవేయడంలో విజయవంతమైంది. ఇటీవల మెదక్ రీజినల్ మేనేజర్ కొత్తగా భద్రాచలం సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలను భక్తులకు చేరవేసేందుకు లాజిస్టిక్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా డిపోకు అదనంగా నాలుగు కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రభుత్వం కేటాయించడం కొండంత అండనిచ్చినట్లయింది. ఈ బస్సులను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సోమవారం ప్రారంభించనున్నారు.
సంగారెడ్డి, మార్చి 26: ఆర్టీసీ ఆర్థికంగా బలపడే దిశగా పరుగులు పెడుతున్నది. సంగారెడ్డి డిపోకు కొత్తగా కేటాయించిన 4 లగ్జరీ బస్సులను ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు నేడు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి డిపోలో 95 బస్సులున్నాయి. జిల్లాలోని ప్రధాన రూట్లలో రోజుకు 34,234 కిలోమీటర్లు తిరుగుతూ 26,500 మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆదాయం పొందుతున్నది. దీంతో రోజుకు రూ.14.50 లక్షల ఆదాయం సమకూరుతున్నది. ఈ బస్సులతోపాటు డిపోకు అదనంగా రొత్గా 4 సూపర్ లగ్జరీ బస్సులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో నేడు మంత్రి హరీశ్రావు ఈ బస్సులు ప్రాంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సంగారెడ్డి డిపోలో 95 బస్సులు
సంగారెడ్డి డిపోలో మొత్తం 95 బస్సులున్నాయి. ఇందులో 72 ప్రభుత్వం కేటాయించినవి కాగా అద్దె ప్రాతిపదికన 23 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో 6 లగ్జరీ, 22 ఎక్స్ప్రెస్లు, 40 పల్లె వెలుగు బస్సులు, 4 మినీ పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. అద్దె బస్సుల్లో 5 ఎక్స్ప్రెస్లు, 18 పల్లె వెలుగు బస్సులు రోజు వారీగా తిరుగుతున్నాయి.
రోజూ 34,324 కిలోమీటర్లు తిరుగుతున్న బస్సులు
సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు రోడ్డు మార్గం ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు నడిపించాలనే సంకల్పంతో అధికారులు కృషి చేస్తున్నారు. 95 బస్సులు రోజూ 34,324 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇందులో ఆర్టీసీ లగ్జరీ బస్సులు 6 రోజుకు 3458వేల కిలోమీటర్లు, 22 ఎక్స్ప్రెస్లు 11924 కి.మీ, 40 పల్లె వెలుగు బస్సులు 10207 కి.మీ, 4 మిని పల్లె వెలుగు బస్సులు 300 కి.మీ, 18 అద్దె బస్సులు 6290 కి.మీ, 5 ఎక్స్ప్రెస్ బస్సులు 2145 కిలోమీటర్లు తిరుగుతూ ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.
కొత్త బస్సులు పుణ్యక్షేత్రాలకు..
సంగారెడ్డి డిపోకు మరో 4 లగ్జరీ బస్సులను ప్రభుత్వం కేటాయించింది. ఈ బస్సులను మంత్రి హరీశ్రావు సోమవారం ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త లగ్జరీ బస్సులను శ్రీశైలం దైవ క్షేత్రానికి నడిపించనున్నారు. సంగారెడ్డి నుంచి శ్రీశైలానికి రోజూ ఉదయం 4.30 గంటలు, ఉదయం 5.30 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 2 గంటలకు సంగారెడ్డి నుంచి బయలుదేరనున్నాయి. రిజర్వేషన్ కోసం www.tsrtconline.inని సంప్రదించాలని అధికారులు సూచించారు.
విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు
సంగారెడ్డి డిపో నుంచి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. సంగారెడ్డి సమీపంలోని ఆయా గ్రామాలతో పాటు నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాల, ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలకు ఉదయం 8 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలు, సాయంత్రం 4.00 గంటల నుంచి ఎంఎన్ఆర్కు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నాం. ఆర్టీసీలో ప్రయాణించేందుకు వారంవారం నిర్వహించే ఫోన్ ఇన్ డిపో మేనేజరు కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చి ఫిర్యాదులు, వినతులపై స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు 30 మంది పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నామని తెలిపితే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం
– ఉపేందర్, డిపో మేనేజరు, సంగారెడ్డి