అమీన్పూర్, మే 13: సంగారెడ్డి జిల్లాలోనే అత్యంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం చోటు చేసుకున్నాయి. అత్యంత భారీ పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ రెవెన్యూ అధికారులు వందల సంఖ్యలో నిర్మాణాలు, ఇళ్లను నేలమట్టం చేశారు. పక్కా ప్రణాళికతో వారు కూల్చివేతలు చేపట్టారు. స్థానికులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి విజయవంతంగా కూల్చివేతలను పూర్తి చేశారు.
అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొంతకాలంగా కోర్టు వివాదంలో ఉన్న సుమారు 200 ఎకరాల భూముల్లో కొందరు అక్రమ నిర్మాణాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సర్వే నంబర్లు 1 నుంచి 121 వరకు ఉన్న 1263 ఎకరాల భూములపై కోర్టులో వివాదం నడుస్తోంది. అందులో ప్రస్తుతం 200 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు 15 రోజుల నుంచి చర్చలు, సమావేశాలు నిర్వహించారు. అనంతరం పలు శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కూల్చివేతలకు పూనుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టారు.
కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని సంగారెడ్డి ఆర్డీవో నగేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఐలాపూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను శనివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి 18 జేసీబీల సహాయంతో కూల్చివేశామని చెప్పారు. ఈ కూల్చివేతల్లో పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. మొత్తం 17 మంది తహసీల్దార్లు, 13 మంది నాయబ్ తహసీల్దార్లు, 13 మంది గిర్దావర్లు, పలువురు డీఎల్పీవోలు, 13 మంది ఎంపీవోలు, నలుగురు డీస్పీలు, 14 మంది సీఐలు, 26 మంది ఎస్సైలు, 78 మంది పంచాయతీ కార్యదర్శులు, 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వెళ్లే రహదారిలో ఐలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో దారికి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను తొలిగించారు. అక్రమంగా నిర్మించిన ఇండ్లను సైతం నేలమట్టం చేశారు. పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కూల్చివేతల్లో పాల్గొన్నారు. కూల్చివేతలను పలువురు అడ్డుకుంటారన్న అనుమానం ఉన్నవారందరినీ స్థానిక పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి ఆర్డీవో నగేశ్, డీఎస్పీ భీమిరెడ్డిలతోపాటు మరికొందరు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. జట్లు, జట్లుగా విడిపోయి ఏకకాలంలో కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐలాపూర్, ఐలాపూర్ తండాల్లో కిష్టారెడ్డిపేట రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాల్లో ఉంటున్నవారిని బయటకు పంపించి, సామగ్రిని తొలిగించి అనంతరం కూల్చివేశారు.