సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 15: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉన్నది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రోజంతా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాలతో సింగూరు నిండుకుండలా మారింది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీ కాగా ప్రస్తుతం 29.184 టీఎంసీలుగా ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో సింగూరు మూడు గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదులుతున్నారు. ఎగువ నుంచి 20,300 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో మూడు గేట్ల ద్వారా దిగవకు 32,892 క్యూసెక్కుల జలాలు వెళ్తున్నాయి. సింగూరు ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో మంజీరా నది పరీవాహక ప్రాంత రైతులు, గొర్రెలకాపర్లు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రెండు రోజులుగా కుండపోత
జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. శనివారం రెండు సెం.మీటర్ల సాధారణ వర్షపాతం కురిసింది. అత్యధికంగా హత్నూర మండలంలో 4.56 సెం.మీ, జిన్నారంలో 4.55 సెం.మీ, ఝరాసంగంలో 4.50సెం.మీ, న్యాల్కల్లో 4.43సెం.మీ, పుల్కల్లో 3.7సెం.మీ, నాగల్గిద్దలో 3.1సెం.మీ వర్షం కురిసింది. కోహీర్, వట్పల్లి, సదాశివపేట, సంగారెడ్డి, గుమ్మడిదల, రాయికోడ్, మనూరు, అమీన్పూర్ మండలాల్లో రెండు నుంచి మూడు సెం.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 17 మండలాల్లో సాధారణ కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువుతో పాటు పలు గ్రామాల్లో చెరువులు అలుగు పారాయి. జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. నారాయణఖేడ్లో మోస్తరుగా వర్షం కురిసింది. అందోలు నియోజకవర్గంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాలతో వట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బోరు బావుల నుంచి భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. జహీరాబాద్ సమీపంలోని నారింజ వాగు ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తున్నది. నారింజవాగు ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద ప్రవహిస్తున్నది.
ఆందోళన చెందుతున్న రైతులు
రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతింటున్నదని రైతులు కలవరపడుతున్నారు. ప్రస్తుతం పత్తి కాయ దశలో ఉంది. వర్షాలు ఇలాగే కురిస్తే పంట దెబ్బతిని దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు రోజులు వర్షాలు కురిస్తే పత్తికాయలు నల్లబారి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మిగతా మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.