సంగారెడ్డి కలెక్టరేట్, మే 25 : ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రూ.1.44 కోట్లతో నిర్మించిన నూతన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని సోమవారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలోని బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరిత వనం పేరుతో రెండు ఆధునిక ఎకో పార్కులు అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. త్వరలో నారాయణఖేడ్, జహీరాబాద్తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.