సంగారెడ్డి కలెక్టరేట్/అర్బన్, మార్చి 24: సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ స్కూల్కు ఎన్వోసీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా డీఈవో, అదే కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్లను శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు మూడు గంటల పాటు డీఈవో కార్యాలయంలోనే దర్యాప్తు చేపట్టారు.
ఏసీబీ డీఎస్పీ ఏపీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రపురంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలను స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ (సీబీఎస్ఈ)కు మార్చుకోవానుకుంటున్నామని డీఈవోను ఈ నెల 15న కలిశారు. సెంట్రల్ సిలబస్కు మార్చేందుకు అవసరమైన అన్ని పత్రాలు కలిగి ఉన్నందున తమకు ఎన్వోసీ ఇవ్వాల్సిందిగా డీఈవోను కోరారు. రూ.లక్షా 10 వేలు ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ రామకృష్ణతో బేరసారాలు సాగించారు. ఇది నచ్చక సదరు యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. దీంతో పక్కా ప్రణాళికతో మరోసారి బేరానికి రాగా, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వలేమని, ముందు రూ.50 వేలు ఇచ్చి, తరువాత రూ.60 వేలు ఇస్తామని ఒప్పుకున్నారు.
అందుకు అసిస్టెంట్ రామకృష్ణ, డీఈవోలు ఒప్పుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సంగారెడ్డిలోని డీఈవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మాటు వేసిన సమయంలో ఇప్పటికే ఒప్పుకున్న విధంగా రూ.50 వేలు లంచం అందించారు. అది గమనించిన ఏసీబీ అధికారులు వెంటనే రెడ్ హ్యాండెడ్గా డీఈవో రమేశ్, అసిస్టెంట్ రామకృష్ణను పట్టుకున్నారు. అదే సమయంలో సంగారెడ్డిలోని రామకృష్ణ ఇంటితో పాటు హైదరాబాద్లోని డీఈవో రాజేశ్ ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, రమేశ్, నగేశ్, వెంకట్రాజు గౌడ్ ఉన్నారు.
జిల్లా విద్యాశాఖ బాధ్యతలను ఆర్జేడీ విజయలక్ష్మికి అప్పగించారు. డీఈవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న ఆర్జేడీ అక్కడికి చేరుకున్నారు. డీఈవో నాంపల్లి రాజేశ్ లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇన్చార్జి బాధ్యతలను ఆమె స్వీకరించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయలక్ష్మికి ఇన్చార్జి బాధ్యతలు విద్యాశాఖ అప్పగించినట్లు తెలుస్తున్నది.