సంగారెడ్డి, జూన్5: తాగు, సాగుకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా జిల్లా సూపరింటెండెంట్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని ఎస్ఈ కార్యాలయం నుంచి పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు విద్యుత్ ఉద్యోగుల ర్యాలీని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఎస్ఈ కార్యాలయంలోని 40 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.
విమర్శించిన నోళ్లు మూయించిన సీఎం కేసీఆర్ : చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్
2014కు ముందు ప్రజలు ఎదుర్కొన్న విద్యుత్ కోతలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలు దీపాలు పెట్టుకోవాల్సిందేనని విమర్శలు చేసిన నాయకుల నోళ్లు ఇప్పుడు మూత పడ్డాయన్నారు. ఎస్సీ, ఎస్టీకు నెలకు 101 యూనిట్లు, రజకులు, నాయీ బ్రహ్మణులకు ఉచిత కరెంటు అందిస్తున్నారన్నారు.
తెలంగాణతో పరిస్థితులు మారాయి : కలెక్టర్ శరత్
కలెక్టర్ మాట్లాడుతూ గతంలో తాను ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎండిన పంటలతో అన్నదాతలు, ఖాళీ బిందెలతో మహిళలు అధికారులను అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయన్నారు. ఇప్పుడు నిరంతరం కరెంటు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎదగడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ ఆధునీకరణకు రూ.1068 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, 11కేవీ లైన్లు నిర్మించడంతో సాగుకు నిరంతర కరెంట్ ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో గతంలో 7,738 మెగావాట్ల విద్యు త్ సరఫరా ఉండాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లకు పెరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలతో తలసరి విద్యుత్ 13,056 యూనిట్ల నుంచి 21,265 యూనిట్లకు పెరిగిందన్నారు. ఈ యాసంగిలో సంగారెడ్డి జిల్లాలో 2.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి వరి సాగులో పంజాబ్ను వెనక్కి నెట్టి తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.
జనరేటర్లకు స్వస్తి : ఎస్పీ రమణకుమార్
సంగారెడ్డి జిల్లాలోని మారుముల ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్లో కరెంటు పోతే జనరేటర్లు వాడే వారని ఎస్పీ రమణకుమార్ అన్నారు. నేడు ఆ పరిస్థితి మారిందని, ప్రతి పోలీస్స్టేషన్కు నిరంతరంగా విద్యుత్ అందిస్తుండడంతో జనరేటర్లను పక్కన పెట్టామన్నారు. దేశంలోనే నిరంతరంగా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. విద్యుత్ సంస్కరణలు ఉన్న చోట పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని, అందుకు తెలంగాణకు తరలివస్తున్న పరిశ్రమలే నిదర్శనమన్నారు.
ఉత్సవాలలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆత్మ చైర్మన్ కృష్ణాగౌడ్, మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి, పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్లు లత, చింత గోపాల్, ఎంపీపీలు సరళ, యాదమ్మ, లావణ్య, మనోజ్రెడ్డి, జడ్పీటీసీలు కొండల్రెడ్డి, పద్మావతి, సునీత, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవీందర్రెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, విద్యుత్ ఉద్యోగులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.