జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటి పారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. నారాయణఖేడ్, అందోల్ ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి విడుదలకు ముందే సింగూర్, నల్లవాగు, చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. నీరు వృథా కావద్దని, చివరి ఆయకట్టుకూ నీరందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్1: జిల్లాలోని భారీ, మధ్య, చిన్న తరహా నీటి వనరుల కింద యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నారాయణఖేడ్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారులతో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి పంటలకు భారీ, మధ్య, చిన్న నీటి వనరుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై ఎమ్మెల్యేలు పలు సూచనలు, సలహాలు చేశారు. సింగూర్ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు, నల్లవాగు ప్రాజెక్టు కింద 5,100 ఎకరాలు, 500 ఎకరాల పైబడి 15 చెరువుల కింద 4,427 ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. నీటిని రెగ్యులేట్ చేయాలని, సింగూర్, నల్లవాగు, చెరువుల మరమ్మతులకు సంబంధించి మేజర్ వర్క్స్ ఏమైనా ఉంటే యాసంగి నీటి విడుదలకు ముందే పూర్తి చేయాలని సూచించారు.
అన్ని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు
అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ అన్ని ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా నీరున్నదన్నారు. అందోల్, పుల్కల్ మండలాల్లోని అన్ని చెరువులు నిండుగా ఉన్నాయన్నారు. యాసంగిలో కొత్తగా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సింగూర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి సాగు చేసే అవకాశమున్నదని వివరించారు. రైతుల అవసరం మేరకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని నీటి పారుదల అధికారులకు సూచించారు. సాయిబాన్పేట, చందంపేట, శివ్వంపేట, కోర్పోల్ చెరువులకు నీరు వెళ్లే కాల్వల మరమ్మతులు చేయించాలన్నారు. నీరు సాఫీగా వచ్చేలా చూడాలన్నారు. సింగూర్ గేట్లకు మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. నీటి ప్రవాహానికి ఆటంకం ఉన్న చోట కాల్వలకు మరమ్మతులు చేయించాలని, అందుకు అసవరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
కాల్వలకు మరమ్మతులు చేయించాలి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ కాకివాగు, ఉజలంపాడ్ ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతు లు చేపట్టాలని సూచించారు. నల్లవాగులో ఎమర్జెన్సీ కాల్వ సమస్య ఉన్నదని, బాగు చేయించాలన్నారు. గంగాపూర్, చాప్టా-బీ, వాసర్, గట్టు లింగంపల్లి చెరువుల కాల్వ సిద్ధం లేకపోవడంతో నిరుపయోగంగా ఉండి రైతులు పంటలు వేయలేకపోతున్నారని వివరించారు. వెంటనే కాల్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆయా అంచనాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి త్వరితగతిన పంపించాలన్నారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, ఈఈలు మధుసూదన్రెడ్డి, జైభీమ్, విజయ్కుమార్, ఉమ్మడి జిల్లా ఇంజినీరింగ్ కన్సల్టెంట్ మల్లయ్య, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.