ఆడబిడ్డలకు బతుకమ్మ సారె అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. అధికారుల నివేదిక మేరకు ఆయా జిల్లాలకు చీరెలను దశల వారీగా పంపిస్తున్నది. మొదటి దశలో వచ్చిన చీరెలను యంత్రాంగం ఆయా గోదాముల్లో భద్రపరిచింది. 18ఏండ్లు నిండిన ప్రతీ అతివకు చీరె అందించనుండగా, ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు సంగారెడ్డిలో 4.80 లక్షల మంది, మెదక్లో 2.82 లక్షల మంది, సిద్దిపేటలో 3,80,127 మంది మహిళలను అర్హులుగా గుర్తించారు.మిగతా చీరెలు పండుగకు ముందు తెప్పించే పనిలో అధికారులు ఉన్నారు. పారదర్శకంగా చీరెల పంపిణీకి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, మహిళలను సంతోషపరిచేందుకు ప్రభుత్వం నూతన పథకాలు అమలు చేసి గౌరవిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా మైనార్టీలకు కొత్త దుస్తులు, నిత్యావసరాలు కానుకగా అందజేస్తున్నది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలను గౌరవించేలా చీరెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నది. తెల్లరేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబంలో 18ఏండ్లు పైబడిన ఆడపడుచులను అర్హులుగా గుర్తిస్తున్నది.
సంగారెడ్డిలో 4.80లక్షల మంది అర్హులు
సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 14 : సంగారెడ్డి జిల్లాలో చీరెల పంపిణీకి 4,80,805 మంది మహిళలను అర్హులుగా చేనేత, జౌళి శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వం పంపిన చీరెలను సంగారెడ్డిలోని నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం, పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగిలోని మార్కెటింగ్ శాఖ గోదాంలలో నిల్వ చేశారు. ప్రస్తుతం జిల్లాకు ఈ నెల 6వ తేదీ వరకు జిల్లాకు 2 లక్షల చీరెలు వచ్చాయని చేనేత, జౌళి శాఖ అధికారి వెల్లడించారు. పూర్తిస్థాయి చీరెలు జిల్లాకు రాగానే పంపిణీ కార్యక్రమం రేషన్ దుకాణాలలో సరఫరా చేయనున్నారు. మిగతా చీరెలు పండుగకు ముందు తెప్పించే పనిలో అధికారులు ఉన్నారు. బతుకమ్మ చీరెల పథకానికి అర్హులైన జాబితాను ఇది వరకే ప్రభుత్వానికి అందజేశారు. పారదర్శకంగా చీరెల పంపిణీకి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించారు.
జహీరాబాద్లో అత్యధికం..
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా రేషన్కార్డుల ప్రాతిపదికన 1,16,064 మంది మహిళలను గుర్తించినట్లు జౌళిశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు పారదర్శకంగా చీరెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకున్నారు. బతుకమ్మ వేడుకలకు నాలుగు రోజుల ముందే చీరెలను అందజేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలను నియమించారు. గ్రామస్థాయిలో చీరలను నిల్వ చేసేందుకు పంచాయతీ, పాఠశాల భవనాలు, అందుబాటులో ఉన్న ఇతర భవనాలలో గుర్తించి ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.
గ్రామ కమిటీలదే బాధ్యత..
చీరల పంపిణీలో గ్రామ కమిటీలే కీలకంగా వ్యవహరించనున్నారు. ఇది వరకే జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, రేషన్ డీలర్తో ఏర్పాటు చేసిన త్రిసభ్య సభ్యుల కమిటీ చీరల పంపిణీని పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే పట్టణాల్లో బిల్ కలెక్టర్, మెప్మా అధ్యక్షురాలు, డీలర్లను సభ్యులుగా నియమించి, బాధ్యతలు అప్పగించారు.
అన్ని మతాల పండుగలకు కొత్త వస్ర్తాలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటిలాగే ఈ సారి కూడా బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నది. ఐదేండ్లుగా కులమతాలకతీతంగా మహిళలకు అందిస్తుండగా, ఇప్పటికే తయారైన చీరెలను జిల్లాలకు చేరవేస్తున్నది. అనుమతులు రాగానే పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
సిద్దిపేటలో 3,80,127 మంది అర్హులు
సిద్దిపేట, సెప్టెంబర్ 14 : సిద్దిపేట జిల్లాలో 2,935,94 రేషన్ కార్డులుండగా, 9,15,970 యూనిట్లున్నాయి. జిల్లాలో 3,80,127 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. జిల్లా లో 22 మండలాలు, 5 మున్సిపాలిటీలున్నా యి. మండలాల వారీగా అక్కన్న పేటలో 15,274 మంది, బెజ్జంకిలో 13,564 మంది, చేర్యాలలో 19,852 మంది, చిన్నకోడూర్లో 17,767మంది, దౌల్తాబాద్లో 12,087 మం ది, దుబ్బాకలో 27,835 మంది, గజ్వేల్లో 32,989 మంది, హుస్నాబాద్లో 15,404 మంది, జగదేవ్పూర్లో 15,294 మంది, కోహెడలో 17,945మంది, కొమురవెళ్లిలో 6,979 మంది, మద్దూర్లో 15,178 మంది, కొండపాకలో 16,755 మంది, మార్కుక్లో 8948 మంది, మిరుదొడ్డిలో 16,636 మంది, ములుగులో 13,5650 మంది, నంగునూర్లో 14,291మంది, నారాయణరావుపేటలో 7179 మంది, రాయపోల్లో 10,855 మంది, సిద్దిపేట రూరల్లో 10,911 మంది, సిద్దిపేట అర్బన్లో 47,527 మంది, తొగుటలో 10,160 మంది, వర్గల్లో 13,347 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇప్పటి వరకు జిల్లాకు 2.33లక్షల చీరెలు వచ్చాయి. వీటిని మార్కెట్ కమిటీలో గోదాంలో భద్రపరిచారు. ఈ సారి చీరెలు మొత్తం 40రకాల కలర్లలో ఆకర్షణీయంగా డిజైన్ బార్డర్లతో తీర్చిదిద్దారు. సిద్దిపేట జిల్లాలకు వచ్చిన చీరెలను సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో భద్రపరిచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటినీ పంపిణీ చేయనున్నారు.
మెదక్లో తుదిదశకు ఎంపిక
మెదక్, సెప్టెంబర్ 14 : మెదక్ జిల్లాలో రేషన్ కార్డుల ఆధారంగా 2.82 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 1.61 లక్షల బతుకమ్మ చీరెలు వచ్చాయి. పేదరిక నిర్మూలన సంస్థ, పౌర సరఫరాల విభాగం ఆధ్వర్యంలో వీటిని మహిళలకు అందించనున్నారు. ఈ సంవత్సరం కొత్త కార్డులు మంజూరుకావడంతో అందరికీ అందనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే మరో 3,500 మంది పెరిగే అవకాశం ఉంది. బతుకమ్మ చీరెలు పంపిణీ చేసేందుకు మండలాల వారీగా అర్హత గల లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపిక కూడా తుది దశకు చేరుకుందన్నారు.
పంపిణీకి చీరెలు సిద్ధం
ఇప్పటి వరకు జిల్లాకు రెండు లక్షల చీరెలు అందాయి. పూర్తి స్థాయి చీరెలు రాగానే పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చేనేత రంగానికి పూర్వవైభవం రావడం ఖాయం. బతుకమ్మ పండుగకు మహిళందరకీ చీరెల పంపిణీతో పాటు చేనేత కార్మికులందరికీ చేతినిండా పని కల్పించారు.
ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం..
బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుండగా, అంతకు ముందు వారంలో లబ్ధిదారులకు చీరెలు పంపిణీ చేస్తాం. జిల్లాలోని మెదక్ మార్కెట్ కమిటీతో పాటు నర్సాపూర్లోని సీఎల్ఆర్సీ భవన్లో చీరలను భద్రపరిచాం. గోదాముల నుంచి మొదట మండలాల వారీగా చీరెలు పంపిణీ చేస్తాం. అక్కడి నుంచి చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్రామ స్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తాం. మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి కమిటీల ద్వారా పంపిణీ చేయిస్తాం.