వట్పల్లి జూలై 2 : మారు మూల గ్రామాలను సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. పల్లెప్రగతి, హరితహారంలో భాగంగా వట్పల్లిలోని మార్కెట్ యార్డులో శుక్రవారం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఆరు మొక్కలు అందజేయాలని అందులో పండ్లు , పూలు, నీడనిచ్చే మొక్క లు ఉండేలా జాగ్రత వహించాలన్నారు. గ్రామం పచ్చదనంతో కనువిందుగా కనిపించాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పీరంగి, ఎంపీడీవో గీత, వరం కమిటీ చైర్మన్ వీరారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్, జడ్పీటీసీ అపర్ణ, సర్పంచ్ సురేఖబుద్ధిరెడ్డి, ఎంపీటీసీ ఇందిరారాజేందర్రావు, కో ఆప్షన్ సభ్యులు కుతుబుద్దీన్ పాల్గొన్నారు.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం
జహీరాబాద్, జూలై 2: ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం రాయిపల్లితండాలో పల్లె ప్రగతి సభలో పాల్గొని ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. మన చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్కు లీకేజీ ఏర్పడి తండాలోకి నీరు రావడం లేదని ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే స్పదించిన ఎమ్మెల్యే వారం రోజుల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాని ఏఈ ప్రవీణ్కు ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో ఇండ్ల పై నుంచి కరెంట్ వైర్లు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తెలుపడంతో సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మురళి, ఎంపీడీవో రాములు, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, గ్రామ సర్పంచ్ చౌవాన్ కిర్, టీఆర్ఎస్ నాయకులు మోహన్రెడ్డి పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
కోహీర్, జూలై 2 : పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కలను అందజేశారు. హరితహారం నిర్వహించేందుకు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జామ, మందార, గులాబీ, తులసి, తదితర రకాల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీవో సునందరావు, ఏపీఎం సమ్మయ్య, సర్పంచ్లుపాల్గొన్నారు.
పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములుకావాలి
హత్నూర, జూలై 2 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని పలుగ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పారిశుధ్య చర్యలు చేపట్టారు. పల్లెప్రగతిలో గ్రామాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని, మరింత అభివృద్ధిని సాధించడం కోసం విడుతల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో శారదాదేవి, ఎంపీవో సువర్ణ పాల్గొన్నారు.
ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి
రాయికోడ్, జూలై2 : ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో విరజిల్లినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం చూడగలుగుతామని మండల ప్రత్యేక అధికారి కేశురామ్ అన్నారు. దౌల్తాబాద్, సీరూర్, మహిబాత్పూర్, శంశోద్దీన్పూర్ గ్రామాల్లోపల్లె ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశం, మండ ల పంచాయతీ అధికారి శ్రీకాంత్గౌడ్, ఎంపీపీ మమతఅశోక్, జడ్పీటీసీ మల్లికార్జున్పాటిల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ఉన్నారు.
ప్రజలు బాధ్యత తీసుకోవాలి
న్యాల్కల్, జూలై 2 : మరియంపూర్ గ్రామంలో రాత్రి డివిజన్ పంచాయతీ అధికారి రాఘవరావు పల్లెనిద్ర చేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించారు. అనంతరం చాల్కి, చీకూర్తి, ముర్తుజాపూర్, కాకినవాడ, అమీరాబాద్, హుస్సేనగర్ గ్రామాల్లో పర్యటించి, పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. మొక్కల సంరక్షణను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారి జగదీశ్వర్ కోరారు. గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు సుధారాణి, మారుతీయాదవ్, సరితా, కుతుబోద్దీన్, కవిత, శకుంతల, పంచాయతీ కార్యదర్శులు నాగభూషణం, గాయత్రీ, ఈజీఎస్ టీఏలు వెంకట్రావు, ప్రవీణ్కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం
అందోల్, జూలై 2: స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో ఇన్చార్జి కమిషనర్ నిర్మల, కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. ఎంపీడీవో సత్యనారాయణ గ్రామాల్లో పర్యటించి డాకూర్లో పల్లెనిద్రలో పాల్గొన్నారు. మురుగు కాలువలు, అంతర్గత రహదారులను పరిశీలించారు.
ర్యాకల్లో పల్లె నిద్ర
నారాయణఖేడ్, జూలై 2ః ర్యాకల్ గ్రామంలో గురువారం రాత్రి జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్నాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి సహా పలువురు అధికారులు పల్లె నిద్రలో పాల్గొన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో చర్చించారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులను వివరించి సమస్యలను తెలుసుకున్నారు.
మొక్కల పంపిణీ
పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. హన్మంత్రావుపేట్ గ్రామంలో స్థానిక డీఎల్పీవో మొక్కలు నాటారు. మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ పట్టణంలోని కోర్టు కాలనీలో మొక్కలను పంపిణీ చేశారు.
అధికారుల పల్లెనిద్ర
జహీరాబాద్, జూలై 2: ఎంపీడీవో రాములు గురువారం రాత్రి మండలంలోని రాయిపల్లి(డి) గ్రామంలో పల్లె నిద్ర చేసి ఉదయం ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో పల్లెప్రగతి సందడి
నాగల్గిద్దా/మనూర్, జూలై 2 : పల్లె ప్రగతితో గ్రామాల్లో సందడి నెలకొంది. గ్రామ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. మొక్కలను పంపిణీ చేశారు.