జిన్నారం, డిసెంబర్ 23 : గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎస్సై విజయరావు తన సిబ్బందితో వెళ్లి రెండు టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి రూ.3300 జరిమానా విధించారు.
కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలో నుంచి నెల రోజుల క్రితం మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీల కు సరఫరా చేశారు. తాజాగా ఆ వ్యక్తులే కిష్టయ్యపల్లి, కొర్లకుంట గ్రామ సమీపంలో టీఎస్ఐఐసీ, అటవీ భూమిలోంచి మట్టిని ఇటాచీలతో తవ్వి టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలించారు. నాలుగు రోజులుగా మట్టి తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారు. దీనిపై నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.