హుస్నాబాద్, ఫిబ్రవరి 20: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో జాతరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెలు, జాతర ఆవరణ మొత్తం రంగులు వేసి ముస్తాబు చేశారు. బుధవారం నుంచి నాలుగు రోజులు జాతర కొనసాగనుంది. భక్తుల కోసం చలువ పందిళ్లు వేసి, క్యూ కోసం ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. జాతర మొదటి రోజు బుధవారం సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకుంటుంది. గురువారం సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకోవడంతో పూర్తి స్థాయిలో జాతర ప్రారంభమవుతుంది. శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్య లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తారు. శనివారం సాయం త్రం అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. జాతరకు హుస్నాబాద్ పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తారు. మేడారం జాతరలో జరిగే విధంగానే ఇక్కడ కూడా ఉత్సవాలు జరుగుతాయని, అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
నంగునూరు, ఫిబ్రవరి 20 : రెండేండ్లకు ఒకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు మండలంలోని అక్కెనపల్లి గ్రామం ముస్తాబైంది. మేడారంలో జరిగే మాదిరిగానే అక్కెనపల్లిలో 40 ఏండ్లుగా జాతర జరగడం ఆనవాయితీగా వస్తున్నది. మేడారం వెళ్లలేని భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు మండల పరిధిలోని గ్రామాల నుంచే కాక.. ఇతర ప్రాం తాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. భక్తులు మొక్కు తీర్చుకునేందుకు నిలువెత్తు బంగారం(బెల్లం), ఒడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వర జాతర కొనసాగనున్నది. జాతరలో భాగంగా నేడు సారలమ్మను గద్దెకు తీసుకురావడం, రేపు సమ్మక్కను గద్దెకు తీసుకువచ్చే కార్యక్రమం కనుల పండువగా నిర్వహిస్తారు. శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. శనివారం తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 20 : ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ మినీ మేడారంగా విరాజిల్లుతున్నది. 30 ఏండ్ల క్రితం గ్రామంలో పాటిగడ్డ బావుల సమీపంలో వెదురు పొదల్లో పసుపు-కుంకుమ రూపంలో సమ్మక్క-సారలమ్మలు గ్రామస్తులకు దర్శనిమిచ్చారు. అప్పటి నుంచి గ్రామం లో ప్రతి రెండేండ్లకు ఒకసారి వనదేవతల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మేడారం నుంచి వచ్చిన కోయపూజారుల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. నల్ల చెరువు సమీపంలో పచ్చని చెట్ల మధ్య వనదేవతలు భక్తులకు దర్శనమిస్తున్నారు. గ్రామంలో నేటి నుంచి ఈ నెల 24వరకు సమ్మక్క-సారలమ్మ జాతర కొనసాగనున్నది. నేడు సారలమ్మదేవత గద్దెకు రావడం, 22న సమ్మక్క దేవత గద్దెకు రావడం, 23న వనదేవతలకు మొక్కు లు చెల్లించడం, 24న సమ్మక్క-సారలమ్మల వనప్రవేశం జరుగుతుందని జాతర కమిటీ చైర్మన్ కొండూరి శ్రీనివాస్ తెలిపారు.