సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నది. ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా ప్రభుత్వం డబ్బులను జమచేసింది. పదో విడతకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
మెదక్/ సంగారెడ్డి/ సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 27: యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో పదో విడత రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను నేటి నుంచి రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా రైతుబంధును అందించారు. ప్రస్తుతం అందించే రైతుబంధు పదోది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి తొమ్మిది విడతల్లో 67,93,621 మంది రైతులకు రూ.7,055. 87 కోట్లు రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 23,12,516 మందికి రూ. 2,504.58 కోట్లు, మెదక్ జిల్లాలో 19,69,954 మందికి, రూ.1,642.98 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 25,11,151 రైతులకు రూ. 2,908.31 కోట్లు వేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి మొదలుకొని పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు సంక్రాంతిలోగా రైతుబంధు డబ్బులను వేయనున్నారు. ఆ దిశగా అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉండి ఇంకా ఎవరైనా రైతుల వివరాలు నమోదు కాకపోతే వారి వివరాలను నమోదు చేసుకుంటారు. ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం.
తొమ్మిది విడతల్లో పంపిణీ ఇలా..
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి తొమ్మిది విడతల్లో 67,93,621 మంది రైతులకు రూ.7,055. 87 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సిద్దిపేట జిల్లాలో 23,12,516మంది రైతులకు రూ. 2,504.58 కోట్లు , 19,69,954 మంది రైతులకు రూ.1,642.98 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 25,11,151మంది రైతులకు రూ. 2,908.31 కోట్లు వేశారు. ప్రస్తుతం 10వ విడత రైతుబంధు నేటి నుంచి నేరుగా రైతుల ఖాతాలోనే జమ కానున్నది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 3,31,167 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు రూ.319 కోట్ల రైతుబంధు నిధులు జమ కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
గతంలో లాగానే ఒక ఎకరం నుంచి ప్రారంభమై రెండు, మూడు.. ఇలా రోజు రోజుకూ పెరుగుతూ సంక్రాంతిలోగా జిల్లాలోని రైతులందరికీ ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేయనున్నది. సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుబీమా, సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్ వంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి.. పట్ట గిట్టుబాటు ధర కల్పించి పంటను కొనుగోలు చేస్తున్నారు. నేటి నుంచి రైతుబంధు డబ్బులు జమ కానుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.