అల్లాదుర్గం, డిసెంబర్ 8: మండలంలోని గడిపెద్దాపూర్లో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా ఎంచుకుని ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు, నగదును అపహరించుకొనిపోయారు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని గడిపెద్దాపూర్లో జరిగింది. స్థానిక సీఐ జార్జి, గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కగోరి యాదయ్య దంపతులు అందోల్ మండలంలోని కన్సాన్పల్లిలో జరుగుతున్న జాతరకు బుధవారం ఉదయం వెళ్లారు. గురువారం ఉదయం ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో చుట్టుపక్కలవాళ్లు వారికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటినా అక్కడికి చేరుకుని పరిశీలించగా, ఇంటిలోని బీరువా ధ్వంసం చేసి 3 తులాల బంగారం, 35 తులాల వెండి నగలు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఈ ఇంటి సమీపంలో ఉన్న గుర్గల సత్యనారాయణ ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో పడుకున్నాడు.
ఆ ఇంటి తాళాలు పగలగొట్టి రెండు బీరువాలను ధ్వంసం చేశారు. ఇక్కడ ఏమీ దొరకకపోవడం తో వారు వాడిన గొడ్డలిని అక్కడే వదిలేశారు. శివమ్మ తన కుమారుడితో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నది. దీంతో ఆమె ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇంటి తాళాలు పగలగొట్టి ఉంటారని కాలనీవాసులు తెలిపారు. ఈ ఇంట్లో జరిగిన చోరీలో ఏ మేరకు పోయిందో శివమ్మ వస్తే తప్ప వివరాలు తెలియదు. ఇదే కాలనీలోని గుర్గుల శేఖర్ తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. వారి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా, అది తెరుచుకోకపోవడంతో వదిలేశారు. గుర్గుల భాగమ్మ ఇంటి తాళాలు కూడా పగలగొట్టి చోరీకి యత్నించారు. మరో కాలనీలో నివసిస్తున్న కొడారి విఠల్ ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి, అందులోని తులం బంగారం, 14 తులాల వెండి నగలతో పాటు రూ.75 వేలను చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇదే గ్రామంలో బచ్చలి దుర్గయ్య ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఆయన కోడలు పెంటమ్మ అరుపులతో పారిపోయారు. జంగలి నర్సింలు ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఇలా ఏకంగా ఆరు ఇండ్లలో చోరీలు జరగడంతో గ్రామస్తులు భయాందోళ చెందుతున్నారు. ఈ విషయంపై స్థానిక సీఐ జార్జీ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాలకు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.