రైతులోకం పరవశించింది.. ఒక్కచోట చేరి జాతర చేసుకున్నది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన రైతు దినోత్సవం పండుగను తలపించింది. వేలాది మంది రైతులు వేడుకల్లో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో భారీ ఊరేగింపు నడుమ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీగా రైతువేదికల వద్దకు చేరుకున్నారు. మహిళలు బతుకమ్మలతో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, గూడెం మహిపాల్రెడ్డి, కలెక్టర్లు, శరత్కుమార్, రాజర్షి షా, జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలతా గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. వ్యవసాయం దండుగ అన్నచోటే పండుగలా మార్చారని కొనియాడారు. యాసంగి వడ్లు కొనబోమని కేంద్రం మొండికేస్తే.. నేనున్నానంటూ సీఎం కేసీఆర్ చివరి గింజ వరకూ కొనుగోలు చేసి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
– సంగారెడ్డి/మెదక్ (న్యూస్నెట్వర్క్) జూన్3
అన్నదాతలు బండెనక బండి కట్టి దశాబ్ది ఉత్సవాలకు తరలివచ్చారు. సంబురాల్లో భాగంగా రెండో రోజు తెలంగాణ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం వేదికలను సుందరంగా ముస్తాబు చేశారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల గురించి తెలిపేలా ప్రత్యేక ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయా రైతు వేదికల వద్ద సంబురాలు అంబరాన్నంటాయి. అంతకుముందు కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు ఎడ్లబండ్లపై ర్యాలీగా రావడం ఆకట్టుకున్నది. డప్పు చప్పుళ్లు, నృత్యాలు చేస్తూ రైతులు వేదికలకు చేరుకుని తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నదాతలకు వ్యవసాయంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, జూన్ 3