పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే గిరిజన, అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. సంగారెడ్డి జిల్లాలో 3903 మంది తాము సాగు చేసుకుంటున్న 6648.97 ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ దరఖాస్తులు చేసుకోగా, మొదటి విడతలో 1771 ఎకరాలకు సంబంధించి 1130 మందికి పట్టాలు అందించనున్నారు. మెదక్ జిల్లాలో 6867 ఎకరాల పోడు భూములున్నట్టు అంచనా వేయగా,4015 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తొలి దశలో 450 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వీరందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సంగారెడ్డి/మెదక్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల ఏండ్ల నాటి కల త్వరలో నెరవేరనున్నది. సీఎంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘పోడు’ సమస్య పరిష్కరిస్తామన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ వేదికగా పోడు రైతులకు పట్టాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లాల్లోని ‘పోడు’ రైతుల్లో సంతోషాన్ని నింపింది. అధికారులు పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు పోడు సాగుచేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి గతేడాది దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించేందుకు గిరిజన, అటవీ, రెవెన్యూ, పంచాయతీ, లాండ్ సర్వే శాఖలతో కలిపి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. ఈ కమిటీల్లోని అధికారులు దరఖాస్తులను నిబంధనల మేరకు అర్హులైన గిరిజన రైతులకు పట్టాలిచ్చేందుకు పరిశీలించారు.
లెక్కకు మించి దరఖాస్తులు
అటవీ హక్కుల చట్టాన్ని అనుసరించి 2005 డిసెంబర్ 13కు పూర్వం మూడు తరాలుగా గిరిజన ప్రాంతంలో ఉంటూ అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతర అటవీ నివాసితులకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పోడు భూములపై హక్కు కల్పించేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. నవంబర్ 18 వరకు ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలోని 11 మండలాల పరిధిలో 51 గ్రామ పంచాయతీల నుంచి 3903 మంది పోడు రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చౌటకూరులో 36, హత్నూర 378, ఝరాసంగం 73, జిన్నారం 172, కల్హేర్ 1307, కోహీర్ 389, మొగుడంపల్లి 699, నారాయణఖేడ్ 19, సిర్గాపూర్ 48, వట్పల్లి 300, జహీరాబాద్లో 482 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3903 మంది తాము సాగు చేసుకుంటున్న 6648.97 ఎకరాలపై భూ యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు.
సంగారెడ్డి జిల్లాలో 1130 మందికి..
ఇటీవలే సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధ్యక్షతన పోడు భూములపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించి కలెక్టర్ శరత్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో తొలి విడత 1130 మంది పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు అందజేయనున్నారు. వీరి ఆధీనంలో 1771 ఎకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించి గిరిజన, రెవెన్యూ శాఖల అధికారులు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో ఉంచడంతో పాటు పట్టా పాసుపుస్తకాల తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న 1130 మంది రైతులకు పట్టాలు అందజేయనున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లో పోడుభూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్న 1130 మంది గిరిజనులకు భూ యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. 1130 మంది రైతులు సాగు చేసుకుంటున్న 1771 ఎకరాలకు సంబంధించి త్వరలో పట్టాలు పంపిణీ చేయనున్నారు.
మెదక్ జిల్లాలో 6867 ఎకరాల్లో పోడు భూమి
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 82 పంచాయతీల్లో పోడు భూములను గిరిజనులు సాగు చేస్తున్నారు. జిల్లాలో 17 మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూములు సాగుచేస్తున్నారు. జిల్లాలో 6,867 ఎకరాల్లో పోడు భూమి ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. 3265 మంది రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. ఇందుకు 4015 మంది దరఖాస్తు చేసుకోగా, అందులోంచి గిరిజనులు 1,061గా గుర్తించారు. పలు దశల్లో విచారించి చివరగా 450 మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిసింది. రైతులు అందజేసిన దరఖాస్తులతో పాటు శాటిలైట్ చిత్రాలను పరిగణనలోకి తీసుకోవడంతో అనేక మందిని జాబితా నుంచి తొలగించారు.
పట్టాలిస్తే.. అనేక ప్రయోజనాలు
అటవీ హక్కు చట్టాన్ని వర్తింపజేసి రైతులకు హక్కు కల్పిస్తే పట్టా భూముల మాదిరి ఉచిత విద్యుత్, రాయితీ విత్తనాలు, బ్యాంకు రుణాలు ఇస్తారు. వారసత్వంగా ఆ కుటుంబానికి చెందిన వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుని జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి భూమిపై రైతుకు ప్రభుత్వం హక్కు కల్పిస్తే వారిని అక్కడి నుంచి తరలించేందుకుగానీ, కేసులు నమోదు చేయడం, భయబ్రాంతులకు గురి చేయడానికి ఆస్కారం ఉండదు. డిసెంబర్ 8 తర్వాత అటవీ శాఖ రికార్డులు, రెవెన్యూ రికార్డులను అనుసరించి ఇరు శాఖల అధికారులు, మండల, డివిజన్ స్థాయిలో దరఖాస్తులు పరిశీలించారు. ఇందులోఅర్హులు, అనర్హులతో వేర్వేరు జాబితా తయారు చేసి జిల్లా కలెక్టర్కు సమర్పించారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీవో, డీఎఫ్వో, సంబంధిత అధికారుల బృందంతో సమీక్షించి అర్హులను గుర్తించారు.
త్వరలోనే పట్టాల పంపిణీ
త్వరలోనే పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం పట్టాలు అందజేయనున్నది. త్వరలోనే అధికారికంగా ఆదేశాలు జారీచేస్తుంది. జిల్లాలో పోడు భూము లు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. వచ్చిన దరఖాస్తుల్లో ప్రభుత్వం నిబంధనల మేరకు అర్హులను ఎంపిక చేశాం. 1130 మంది గిరిజనులను ఎంపిక చేశాం. 1130 గిరిజన రైతులు 1771 ఎకరాల పోడు భూములు సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి పట్టాలు అందజేస్తాం. పోడు భూముల పట్టాల పంపిణీపై ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.
– ఫిరంగి, సంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి