వెల్దుర్తి, జనవరి 4 : ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం తీసుకొని ఎఫ్సీఐ బియ్యం అందించిన మాసాయిపేటలోని శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్మిల్ను సీజ్చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తహసీల్దార్ మాలతి, డిప్యూటీ తహసీల్దార్ సాధిక్తో కలిసి రైస్మిల్ను పరిశీలించి, పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్వో శ్రీనివాస్ మాట్లాడుతూ 2020 యాసంగి సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తీసుకున్న శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్మిల్ యజమానులు వెంకటేశం, రమేశ్, సుధాకర్ ఎఫ్సీఐకి 34,768.40 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, మార్చి 31, 2021 వరకు కేవలం 21,800 క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేసినట్లు తెలిపారు. మిగతా 13 వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయలేదని, ఇందుకు నోటీసులు ఇచినా పట్టించుకోలేదన్నారు. విచారణకు వచ్చిన సమయంలో సైతం రైస్మిల్లుకు తాళం వేసి ఉండడం, ఫోన్ చేసిన స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులతో కలిసి పంచనామా నిర్వహించి రైస్మిల్ను సీజ్చేసినట్లు తెలిపారు. ఎఫ్సీఐకి అందించాల్సిన బియ్యం విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని, రైస్మిల్ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం యజమానుల ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పారు. వీరివెంట డీఎం సాయిరాం, ఆర్ఐ ధన్సింగ్, వీఆర్వోలు వెంకటేశం, భూమేశ్, అశోక్ ఉన్నారు.