సదాశివపేట, జనవరి 17 : సంగారెడ్డి జిల్లా సదాశివపేట బల్దియాలో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుధవారం ఇంటి నెంబర్ కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని హౌసింగ్బోర్డు ఈకోవాలి వెంచర్లో ఇంటినెంబర్ కేటాయించాలని ఆకుల సంగమేశ్వర్ డిసెంబర్ 25న ఆర్ఐ వెంకట్రావును కోరాడు. ఇంటికి సంబంధించిన పత్రాలు అందజేయాలని తెలపగా బాధితుడు సంబంధిత ధృవపత్రాలను సమర్పించాడు. అయినా ఇంటినెంబర్ కోసం రూ.10వేలు ఖర్చు అవుతుందని ఆర్ఐ డిమాండ్ చేశాడు.
అందుకు బాధితుడు పత్రాలు అన్ని ఉండగా డబ్బులు ఎందుకు ఖర్చు అవుతుందని అధికారిని ప్రశ్నించాడు. అనంతరం కొన్ని రోజులపాటు ఆర్ఐ బాధితుడిని కార్యాలయం చుట్టూ తిప్పుకున్నాడు. దీంతో విసుగుచెందిన బాధితుడి కుమారుడు శివకుమార్ ఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకొని, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు నిర్వహించి రూ.8వేలు లంచం తీసుకుంటున్న ఆర్ఐ వెంకట్రావ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల్శర్మలను పట్టుకున్నారు. ఈ మేరకు సెక్షన్ 7బీ, 12బీ కింద కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐ వెంకట్రాజుగౌడ్, ఇన్స్పెక్టర్ రమేశ్ ఉన్నారు.